మేఘావృతమైన వాతావరణంలో.. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా.. స్వింగ్కు సహకరిస్తున్న పిచ్పై పాతకాపు జేమ్స్ అండర్సన్ నిప్పులు చిమ్ముతుంటే.. ఒక్కో పరుగు చేసేందుకు టీమ్ఇండియా తంటాలు పడింది. ఇంకేముంది ఆతిథ్య జట్టుకు మెరుగైన ఆరంభం లభించడమే ఖాయం అనుకుంటున్న దశలో..
టీమ్ఇండియా ఓపెనర్లు దుమ్మురేపారు. తొలి 10 ఓవర్లలో 11 పరుగులే చేసిన మనవాళ్లు.. ఆ తర్వాత మెల్లగా జోరు పెంచారు. రాహుల్ ఒక్కో పరుగు జోడిస్తూ వెళ్తే.. రోహిత్ దంచికొట్టాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రాహుల్.. ఏడేండ్ల తర్వాత లార్డ్స్లో సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డుల్లోకి ఎక్కితే.. రోహిత్, విరాట్ అతడికి చక్కటి సహకారం అందించారు. రెండోరోజు మనవాళ్లు మరెన్ని పరుగులు జోడిస్తారనే దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది!
లండన్: చాన్నాళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై భారత ఓపెనర్లు అదరగొట్టడంతో రెండో టెస్టులో టీమ్ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. లోకేశ్ రాహుల్ (248 బంతుల్లో 127 నాటౌట్; 12 ఫోర్లు, ఓ సిక్సర్) అజేయ సెంచరీకి హిట్మ్యాన్ రోహిత్ శర్మ (145 బంతుల్లో 83; 11 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుపులు తోడవడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీసేన 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆట అరగంట ఆలస్యంగా ఆరంభం కాగా.. పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభిస్తున్న సమయంలో భారత టాపార్డర్ సంయమనం ప్రదర్శించింది. ప్రస్తుతం రాహుల్తో పాటు రహానే (1) క్రీజులో ఉన్నాడు.
భారీ భాగస్వామ్యం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. బంతి స్వింగ్ అవుతున్న దశలో చక్కటి పరిణతి కనబర్చారు. రోహిత్ తన సహజసిద్ధ దూకుడు ప్రదర్శించగా.. రాహుల్ ఆచితూచి ఆడాడు. తొలి 50 బంతుల్లో 13 పరుగులే చేసిన రోహిత్.. కరన్ ఓవర్లో 4,4,4,4 కొట్టి గేర్ మార్చాడు. ఈ క్రమంలో మరోసారి మ్యాచ్కు వరుణుడు అడ్డుపడగా.. టీమ్ఇండియా 46/0తో లంచ్కు వెళ్లింది. రెండో సెషన్లోనూ అదే జోరు కనబర్చిన రోహిత్ 83 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో రోహిత్ ఔట్ కాగా.. కాసేపటికే పుజారా (9) అతడిని అనుసరించాడు. ఈ రెండు వికెట్లు అండర్సన్ ఖాతాలోకే వెళ్లాయి..
రాహుల్ శతకం
గత మ్యాచ్లో తొలి బంతికే డకౌట్ అయిన కెప్టెన్ కోహ్లీ (42) ఈ సారి పట్టుదల కనబర్చగా.. రోహిత్ ఔటైన తర్వాత వేగం పెంచిన రాహుల్.. వరుసగా రెండో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అండర్సన్ను ఆచితూచి ఆడిన ఈ జోడీ.. ఇతర బౌలర్లను ధాటిగా ఎదుర్కొంది. గంటకు 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో మార్క్ వుడ్ బెంబేలెత్తిస్తున్నా.. ఏ మాత్రం తొందరపాటుకు పోని మనవాళ్లు నెమ్మదిగా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. దీంతో భారత్ స్కోరు 200 దాటింది. చక్కటి క్రికెటింగ్ షాట్లతో అలరించిన రాహుల్ 212 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. కాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా కోహ్లీ స్లిప్లో దొరికిపోగా.. రహానేతో కలిసి రాహుల్ రోజును ముగించాడు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83, రాహుల్ (నాటౌట్) 127, పుజారా (సి) బెయిర్స్టో (బి) అండర్సన్ 9, కోహ్లీ (సి) రూట్ (బి) రాబిన్సన్ 42, రహానే నాటౌట్ 1, ఎక్స్ట్రాలు: 14, మొత్తం: 276/3. వికెట్ల పతనం: 1-126, 2-150, 3-267, బౌలింగ్: అండర్సన్ 20-4-52-2, రాబిన్సన్ 23-7-47-1, కరన్ 18-1-58-0, వుడ్ 16-1-66-0, అలీ 13-1-40-0.