కోల్కతా : సాఫీగా సాగుతున్న ఐపీఎల్లో అనూహ్యంగా వరుణుడు తొలి గోల్ కొట్టాడు. సోమవారం ఈడెన్గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయంతో అర్ధాంతరంగా రైద్దెంది. ముందస్తు హెచ్చరికల ప్రకారమే మ్యాచ్ ఆరంభమైన పదిహేను నిమిషాలకే వరుణుడు ఈడెన్గార్డెన్స్ను వర్షంలో ముంచెత్తాడు. సుమారు రెండుగంటల తర్వాత వర్షం తగ్గినా అప్పటికే ఔట్ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆట సాధ్యం కాదని తేల్చిన అంపైర్లు మ్యాచ్ను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. ఇరుజట్లకు తలా ఒక పాయింట్ దక్కింది.
టాస్ గెలిచిన కోల్కతా.. మొదట బ్యాటింగ్కు వచ్చి ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. బార్ట్లెట్ రెండో ఓవర్లో ప్రమాదకర ఫిన్ అలెన్ (6)తో పాటు రూ. 25 కోట్ల ఆటగాడు కామెరూన్ గ్రీన్ (4)ను ఔట్ చేసి ఆ జట్టును దెబ్బతీశాడు. అదే బార్ట్లెట్ మరుసటి ఓవర్ విసిరేందుకు రాగా నాలుగు బంతులు పడగానే వర్షం రావడంతో ఆట ఆగిపోయింది. ఆట నిలిచే సమయానికి కోల్కతా 3.4 ఓవర్లకు 25/2తో నిలిచింది.
కేకేఆర్ ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లేకుండానే ఆ జట్టు బరిలోకి దిగింది. ఈ ఇద్దరూ జట్టులో లేకుండా మ్యాచ్ ఆడటం కోల్కతాకు గత ఏడేండ్ల (2019 లో చివరిసారి)లో ఇదే ప్రథమం. జట్టు ప్రాక్టీస్లో క్యాచ్ అందుకుంటుండగా వరుణ్కు గాయమవడంతో అతడు మ్యాచ్కు దూరమయ్యాడని కెప్టెన్ రహానే చెప్పినా ఇటీవల కాలంలో అతడు ఫామ్లేమితో తంటాలు పడుతుండటంతో అతడిని పక్కనబెడతారన్న వార్తలు వచ్చాయి. నరైన్ను కూడా కేకేఆర్ సరిగ్గా వినియోగించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నా ఈ మ్యాచ్లో అనారోగ్యం కారణంగా అతడిని పక్కనబెట్టడం గమనార్హం.