‘ఐపీఎల్లో నేను ప్రతిసారి ఓడించాలనుకుని, నా కలలో సైతం గెలవాలనుకునే ఒకే ఒక జట్టు ఆర్సీబీ’ అన్న కేకేఆర్ మెంటార్ గౌతం గంభీర్ మాటల నుంచి స్ఫూర్తి పొందారో ఏమో గానీ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) ఆటగాళ్లు అదరగొట్టారు. ఐపీఎల్ ఫ్యాన్స్ ‘ఎల్ ప్రిమేరో’గా పిలుచుకునే ఆర్సీబీ-కేకేఆర్ పోరులో మరోసారి కోల్కతాదే పైచేయి అయింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో ముగిసిన పోరులో డుప్లెసిస్ సేన 183 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. కేకేఆర్ మరో 19 బంతులు మిగిలుండగానే ఛే‘దంచేసింది’. బెంగళూరు హీరో విరాట్ కోహ్లీ పోరాడినా బౌలర్ల వైఫల్యంతో ఆ జట్టు పరాభవాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్-17లో భాగంగా ఆతిథ్య జట్టు (10 మ్యాచ్లలో) ఓడిపోవడం ఇదే ప్రథమం.
IPL | బెంగళూరు: వారం రోజుల క్రితమే మొదలైన ఐపీఎల్-17లో భాగంగా సొంత ఇలాఖాలో ఆడుతున్న మ్యాచ్లను ఆతిథ్య జట్లే గెలుస్తూ వస్తున్న సంప్రదాయానికి తెరపడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. తమ సొంత గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తైంది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. విరాట్ కోహ్లీ (59 బంతుల్లో 83 నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా రెండో అర్థ సెంచరీ సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. భారీ ఛేదనలో కోల్కతా.. 16.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 186 పరుగులతో ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 50, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (22 బంతుల్లో 47, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 39 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లు చిన్నస్వామిలో మెరుపులు మెరిపించారు. సునీల్ నరైన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు వచ్చిన ఆర్సీబీకి ఈ సీజన్ మూడో మ్యాచ్లోనూ ఆశించిన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ డుప్లెసిస్ విఫలమయ్యాడు. డుప్లెసిస్ నిరాశపరిచినా కోహ్లీ.. గ్రీన్తో జతకలిసి కేకేఆర్ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఈ ఇద్దరూ స్టార్క్, నరైన్లను లక్ష్యంగా చేసుకుని బ్యాట్కు పనిచెప్పడంతో పవర్ ప్లేలో ఆర్సీబీ స్కోరు పరుగులెత్తింది. 42 బంతుల్లోనే ఈ జోడీ 65 రన్స్ జోడించింది. గ్రీన్ను రసెల్ 9వ ఓవర్ చివరి బంతికి క్లీన్బౌల్డ్ చేసి పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. 19 బంతుల్లో 3 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి టచ్లోకి వచ్చినట్టే కనిపించిన మ్యాక్స్వెల్.. ఎక్కువసేపు నిలువలేకపోయాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా కోహ్లీ మాత్రం పరుగుల వేటను ఆపలేదు. 36 బంతుల్లో అతడి అర్ధ సెంచరీ పూర్తయింది. ఆఖర్లో దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 20, 3 సిక్సర్లు)తో వేగంగా ఆడిన కోహ్లీ.. ఆర్సీబీ స్కోరును 180 మార్క్ దాటించాడు.
బెంగళూరు భారీ స్కోరే చేసినా ‘చిన్నస్వామి’లో కేకేఆర్ దూకుడు ముందు లక్ష్యం చిన్నబోయింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్లు ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశారు. సిరాజ్ మొదటి ఓవర్లోనే సాల్ట్.. రెండు సిక్సర్లు, ఓ బౌండరీతో 18 రన్స్ రాబట్టాడు. జోసెఫ్ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన నరైన్.. ఆరో ఓవర్లో యశ్ దయాల్పై దయ లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లోనూ 21 పరుగులొచ్చాయి. పవర్ ప్లే ముగిసేసరికే కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది.
పవర్ ప్లే ముగిశాక వరుస ఓవర్లలో ఓపెనర్లు నిష్క్రమించినా వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్లు మిగతా పని పూర్తిచేశారు. జోసెఫ్ 11వ ఓవర్లో వెంకటేశ్.. 6, 4, 6, 4తో రెచ్చిపోయాడు. 30 బంతుల్లోనే అతడి ఫిఫ్టీ పూర్తయింది. అర్ధ సెంచరీ తర్వాత అతడు పెవిలియన్ చేరినా శ్రేయస్ విన్నింగ్ రన్స్ సాధించాడు.
ఎప్పుడూ ఉప్పునిప్పులా ఉండే గౌతం గంభీర్, విరాట్ కోహ్లీ ఒక్కటయ్యారు! చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా గౌతీ, కోహ్లీ కలివిడిగా కనిపించారు. టైమ్ ఔట్లో ఇద్దరు కలిసి సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
241 సిక్సర్లు: ఆర్సీబీ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డు (239)ను కోహ్లీ అధిగమించాడు.
2016 నుంచి ఇప్పటిదాకా చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్తో ఆడిన మ్యాచ్లలో ఆర్సీబీ నెగ్గలేదు. బెంగళూరులో కోల్కతాకు ఇది వరుసగా ఆరో విజయం.
బెంగళూరు: 20 ఓవర్లలో 182/6 (కోహ్లీ 83 నాటౌట్, గ్రీన్ 33, రసెల్ 2/29, రాణా 2/39 )
కోల్కతా : 16.5 ఓవర్లలో 186/3 (వెంకటేశ్ 50, సునీల్ నరైన్ 47, శ్రేయస్ 39 నాటౌట్, వైశాక్ 1/23, దాగర్ 1/23)