అంచనాల్లేకుండా అడుగుపెట్టి.. వరుస విజయాలతో ఫైనల్కు చేరిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ తుదిమెట్టుపై తడబడ్డాడు. మూడేండ్ల తర్వాత మేజర్ టోర్నీ ఫైనల్ ఆడిన శ్రీకాంత్.. ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చినా.. ఆధిపత్యం చెలాయించలేక రజతంతో సరిపెట్టుకున్నాడు. మెగాటోర్నీ పురుషుల విభాగంలో భారత్కు ఇదే తొలి వెండి పతకం కాగా.. ఓవరాల్గా పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత ప్రపంచ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచిన మూడో భారతీయుడిగా శ్రీకాంత్ రికార్డుల్లోకెక్కాడు.
హుయెల్వా (స్పెయిన్): వరుస విజయాలతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఫైనల్కు దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. తుదిమెట్టుపై తడబడి రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 12వ సీడ్ శ్రీకాంత్ 15-21, 20-22తో లోహ్ కీన్ యె (సింగపూర్) చేతిలో పోరాడి ఓడాడు. దీంతో శ్రీకాంత్కు రజత పతకం దక్కింది. ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో భారత పురుష షట్లర్కు ఇదే తొలి రజతం కాగా.. సెమీఫైనల్లో శ్రీకాంత్ చేతిలో ఓడిన యువ ఆటగాడు లక్ష్యసేన్ ఆదివారం కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. ఓవరాల్గా ప్రపంచ చాంపియన్షిప్లో రజతం దక్కించుకున్న మూడో భాతర షట్లర్గా శ్రీకాంత్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో పీవీ సింధు రెండుసార్లు, సైనా నెహ్వాల్ ఓ సారి రన్నరప్ ట్రోఫీలు కైవసం చేసుకున్నారు. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన సింధు క్వార్టర్స్లోనే పోరాటాన్ని ముగించగా.. అకానే యామగుచి (జపాన్) విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో యామగుచి 21-14, 21-11తో ప్రపంచ నంబర్వన్ తై జూ యింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది.
పట్టు చేజార్చి..
2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ పట్టి ఒక్కసారిగా శిఖరాగ్రానికి చేరిన శ్రీకాంత్.. ఆ తర్వాత గాయాలు, ఫామ్ లేమితో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. 2018లో వారం రోజుల పాటు ప్రపంచ నంబర్వన్ ర్యాంక్లో కొనసాగిన శ్రీకాంత్.. చాన్నాళ్ల తర్వాత తనలోని పాత ఆటగాడిని ప్రపంచానికి చూపాడు. 2019 ఇండియా ఓపెన్ తర్వాత తొలిసారి తుదిపోరుకు చేరిన శ్రీకాంత్.. ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్లో చక్కటి ప్రదర్శన కొనసాగించాడు. 43 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో శ్రీకాంత్ తుదికంటా పోరాడాడు. తొలి గేమ్ ఆరంభంలో ఆధిక్యం సాధించిన శ్రీకాంత్ దాన్ని కొనసాగించడంలో విఫలమయ్యాడు. ఫలితంగా బ్రేక్ సమయానికి ఇరువురు ఆటగాళ్లు 11-11తో సమంగా నిలిచారు. అనంతరం 17-13తో ఆధిక్యంలోకి వెళ్లిన లోహ్ కీన్.. అదే జోరు కొనసాగిస్తూ గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ ఆరంభం నుంచి శ్రీకాంత్ స్మాష్లపై దృష్టి పెడితే.. లోహ్ కీన్ తెలివిగా నెట్ గేమ్తో పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఒక దశలో 4-4తో స్కోరు సమం కాగా.. కొన్ని సూపర్ షాట్లతో శ్రీకాంత్ 7-4తో ముందంజలోకి వెళ్లాడు. అయితే ఈ దశలో అనవసర తప్పిదాలకు పాల్పడిన శ్రీకాంత్ 9-9తో స్కోరు సమం కానిచ్చాడు. ఇక అక్కడి నుంచి ఇద్దరు ఆటగాళ్లు కొదమసింహాల్లో పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగింది. 20-20తో స్కోర్లు సమమైన దశలో అప్పటికే రెండు మ్యాచ్ పాయింట్లు కాచుకున్న శ్రీకాంత్.. ఒత్తిడికి గురై గేమ్తో పాటు మ్యాచ్ను కోల్పోయాడు. ఈ విజయంతో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ స్వర్ణం నెగ్గిన తొలి సింగపూర్ షట్లర్గా లోహ్ కీన్ రికార్డుల్లోకెక్కాడు.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల విభాగంలో భారత్కు ఇదే తొలి రజతం. ప్రకాశ్ పదుకొనె (1983), సాయిప్రణీత్ (2019), లక్ష్యసేన్ (2021) కాంస్యాలు కైవసం చేసుకున్నారు.
ప్రపంచ చాంపియన్షిప్లో రజతం నెగ్గిన మూడో భారత షట్లర్గా శ్రీకాంత్ నిలిచాడు. గతంలో సింధు రెండు సార్లు, సైనా ఓ సారి రన్నరప్ ట్రోఫీ చేజిక్కించుకున్నారు.
శ్రీకాంత్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. మనందరికీ ఇది గర్వించదగ్గ క్షణం. టోర్నీ ఆసాంతం శ్రీకాంత్ ఆట సరైన దిశలో సాగింది. తుదిపోరులో కాస్త ఒత్తిడికి లోనవడంతో ఫలితం ప్రతికూలంగా వచ్చింది. అతడి ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా.
ఈ ఏడాది కొన్ని టోర్నీల్లో మంచి ప్రదర్శన చేశా.. కొన్నింట్లో బాగా ఆడలేకపోయా. ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్ చేరడం సంతోషాన్నిచ్చింది. ఇదే జోరు మున్ముందు కూడా కొనసాగిస్తా. వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్షిప్లో రాణించేందుకు ప్రయత్నిస్తా. ఫైనల్లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్లో ఆధిక్యంలో ఉండి కూడా మ్యాచ్ను ముగించలేకపోయా. ఇలాంటి చిన్న చిన్న అంశాలపై మరింత దృష్టి పెట్టి మెరుగయ్యేందుకు కృషిచేస్తా.
-శ్రీకాంత్