భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్.. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ 2022 టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇండోనేషియాకు చెందిన ఆంథనీ సినిసుకా గింటింగ్ చేతుల్లో 21-9, 18-21, 19-21 తేడాతో ఓటమి పాలైన శ్రీకాంత్ ఇంటిదారి పట్టాడు. తొలి రౌండ్లో ఘోరంగా ఓడిన సినిసుక.. ఆ తర్వాతి రెండు రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించాడు.
ఈ పురుషుల సింగిల్స్ మ్యాచ్ 62 నిమిషాలపాటు సాగింది. అంతకుముందు ఆరో సీడ్ పీవీ సింధు మహిళల సింగిల్స్ మ్యాచ్లో ఓటమి చవిచూసింది. జపాన్కు చెందిన సయాక టకహాషితో జరిగిన థ్రిల్లింగ్ గేమ్లో 21-19, 16-21, 21-17 తేడాతో సింధు ఓటమిపాలైంది.
ఇదిలా ఉండగా భారత పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంది. జర్మనీ జంట మార్క్ లామ్స్ఫస్, మార్విన్ సీడెల్పై 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించిన భారత జంట క్వార్టర్స్ చేరింది. అలాగే భారత షట్లర్ లక్ష్య సేన్ కూడా ప్రపంచ మూడో ర్యాంక్ ఆండర్స్ ఆంటోన్సేన్పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు.
కాగా, ఒలింపిక్ మెడల్ విజేత సైనా నెహ్వాల్ మాత్రం.. ప్రపంచ రెండో ర్యాంకర్, సెకండ్ సీడ్ అకానే యమగుచి చేతిలో 21-14, 17-21, 21-17 తేడాతో ఓడిపోయింది. 2022 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ బ్యాడ్మింటన్లో ఇది తొలి బీడబ్ల్యూఎఫ్ సూపర్ 1000 కార్యక్రమం. మార్చి 20న ఇంగ్లండ్లోని ఎరీనా బర్మింగ్హామ్లో జరిగే ఫైనల్స్తో ఈ ఈవెంట్ ముగుస్తుంది.