లక్నో: తమ అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన వెటరన్ క్రికెటర్లు మరోమారు మైదానంలోకి దిగబోతున్నారు. యువ క్రికెటర్లకు తామేం తక్కువ కాదన్నట్లు సత్తాచాటేందుకు సై అంటున్నారు. ఖిలాడీ ఎక్స్ లెజెండ్స్క్రికెట్ టోర్నీలో భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్రైనా, హర్భజన్సింగ్, ప్రవీణ్ కుమార్, రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్, యూసుప్ పఠాన్ భాగం కాబోతున్నారు. వీరితో పాటు సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షాన్, నిక్ కాంప్టాన్, రిచర్డ్ లెవీ, ఇసురు ఉడాన, తిసార పెరెరా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఘజియాబాద్లోని నెహ్రూ స్టేడియం వేదికగా ఈ నెల 30 వరకు జరిగే టీ20 టోర్నీలో మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. చండీగఢ్ చాంప్స్, ఇండోర్ నైట్స్, వైజాగ్ టైటాన్స్, నాగ్పూర్ నింజాస్, పట్నా వారియర్స్, గువాహటి అవెంజర్స్ పోటీపడుతున్నాయి. లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు సెహ్వాగ్ పేర్కొన్నాడు.