చండీగఢ్ : భారత బాక్సింగ్ దిగ్గజం కౌర్సింగ్(74) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్న సింగ్ గురువారం తుదిశ్వాస విడిచారు. తన అద్భుత నైపుణ్యంతో బాక్సింగ్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టారు. న్యూఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో కౌర్ పసిడి పతకంతో చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో ఆరు పసిడి పతకాలు సాధించిన ఈ వెటరన్ బాక్సర్ ఒలింపిక్స్లోనూ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు.
దీనికి తోడు తన పంచ్ పవర్తో ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మద్ అలీతో 1980లో ఎగ్జిబిషన్ బౌట్లో సింగ్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డారు. సింగ్ సాధించిన ఘనతలకు తగిన విధంగా అర్జున(1982), పద్మశ్రీ (1983), విశిష్ట సేవా మెడల్ (1988) పురస్కారాలు అందుకున్నారు. సింగ్ మృతి పట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంతాపం వ్యక్తం చేశారు.