భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. గతంలో కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకంతో సత్తాచాటిన కశ్యప్.. పిక్క గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆరు వారాలపాటు ఆటకు దూరమైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో గత నెలలో ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంటు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ టోర్నీ సందర్భంగానే కశ్యప్కు గాయమైనట్లు సమాచారం. కెరీర్లో అత్యుత్తమంగా అంతర్జాతీయ ర్యాంకుల్లో 6వ స్థానంలో నిలిచిన 35 ఏళ్ల కశ్యప్.. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో భారత్కు ఎన్నో మరపురాని విజయాలందించాడు. డిసెంబరు 24 నుంచి 30 వరకూ జరిగిన ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో కశ్యప్కు గ్రేడ్ 1 గాయమైందని ఫిజియో తెలిపారు.
తనకు గాయం ఎందుకైందో తెలియడం లేదని, వయసు ప్రభావం వల్లనేమో అని కశ్యప్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు. బహుశా వయసు ప్రభావమేమో? ట్రైనింగ్లో ఏం చేస్తున్నానో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి’’ అని కశ్యప్ చెప్పాడు.
హైదరాబాద్ ఓపెన్ తొలి రౌండ్లోనే తనకు గాయమైందని, మంచి ఫీలింగ్తో బరిలో దిగానని, కానీ ఆటకు పూర్తిగా ఫిట్గా లేకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఈ గాయం వల్ల ఇండియా ఓపెన్ సూపర్ 500 సహా భారత్లో జరిగే మూడు ప్రధాన టోర్నీలకు కశ్యప్ దూరమవనున్నాడు.