హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్లో వరుస విజయాలతో హైదరాబాద్ యువ ప్లేయర్ గంటా సాయి కార్తీక్రెడ్డి మెయిన్ డ్రాకు దూసుకెళ్లాడు. దోహాలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మూడో రౌండ్లో సాయికార్తీక్ 6-3, 3-6, 10-8తో పొపివిక్ స్టీవెన్ (జర్మనీ)పై విజయం సాధించి ముందంజ వేశాడు. తొలి సెట్లో పైచేయి సాధించిన హైదరాబాదీ రెండో సెట్ను చేజార్చుకున్నాడు. ఉత్కంఠగా సాగిన ఆఖరి సెట్లో సాయి సత్తా చాటి మెయిన్ డ్రాకు అర్హత పొందాడు. అంతకుముందు తొలి రౌండ్లో 6-1, 6-2తో వినయ్పై నెగ్గిన సాయి.. రెండో రౌండ్లో హుయాంగ్ హో(చైనా)పై విజయం సాధించాడు. మరోవైపు పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాయికార్తీక్-బవా హదిబ్ ద్వయం 2-6, 7-6, 3-10తో తైపీ జోడీ చేతిలో పరాజయం పొందింది.