BCCI Central Contracts | టీమిండియా యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు దేశవాళీలు ఆడలేదనే నెపంతో బీసీసీఐ వారి సెంట్రల్ కాంట్రాక్టులను రద్దు చేయడం భారత క్రికెట్లో చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరికీ రంజీలు ఆడాలని పదే పదే కోరినా వాళ్లు మాత్రం ఆ ఆదేశాలను పెడచెవిన పెట్టారు. ఫలితంగా బీసీసీఐ వారితో పాటు ఇలా చేసేవారికి గట్టిగానే సమాధానం చెప్పింది. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. 1983లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడైన కృతి ఆజాద్ బీసీసీఐ తీరుపై మండిపడ్డాడు. అందరికీ ఒకేరకమైన నిబంధనలు ఉండాలని.. శ్రేయస్, ఇషాన్లను బలిపెట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు.
ఆజాద్ మాట్లాడుతూ… ‘ఇది (అందరూ దేశవాళీలో ఆడాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం) మంచి నిర్ణయమే. అందరూ రంజీ క్రికెట్ ఆడాలి. కానీ ఇప్పుడు వస్తున్న క్రికెటర్ల ప్రియారిటీ మారిపోతోంది. ఐపీఎల్ బాగానే ఉంది. అది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. అక్కడి వరకు ఓకే. కానీ అసలైన క్రికెట్ అంటే ఐదు రోజుల క్రికెట్టే కదా. దేశవాళీలో ఆడటం క్రికెటర్లకు ఎంతో ఉపయోగకరం. మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడు మీరు రోహిత్ శర్మ అయినా విరాట్ కోహ్లీ అయినా దేశవాళీలో ఆడాలి. వాళ్ల రాష్ట్రం తరఫున ప్రాతినిథ్యం వహించాలి. దేశవాళీలు ఆడటం లేదనే నెపంతో ఇద్దరిని శిక్షించడం తగదు. అందరినీ ఒకే రకంగా చూడాలి…’ అని అన్నాడు.
VIDEO | Here’s what former cricketer Kirti Azad (@KirtiAzaad) said on #BCCI dropping Ishan Kishan and Shreyas Iyer from central contract.
“It’s a good move. I think everybody should be playing domestic cricket, Ranji Trophy especially, because you come through the ranks and play… pic.twitter.com/wcndYPLl6o
— Press Trust of India (@PTI_News) February 29, 2024
ఇంటర్నేషనల్ స్టార్స్ అయ్యాక చాలామంది క్రికెటర్లు డొమెస్టిక్ క్రికెట్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఇంగ్లండ్లో జరిగే కౌంటీ క్రికెట్లో మాత్రం ఇలా ఉండదని, అలాంటి విధానాన్ని భారత్లో కూడా తీసుకురావాలని ఆకాంక్షించాడు. ‘కౌంటీ క్రికెట్ చూడండి. అక్కడ సుమారు 20కి పైగా కౌంటీ క్లబ్స్ ఉన్నాయి. మూడు, నాలుగు రోజుల మ్యాచ్లు అక్కడ వందల సంఖ్యలో జరుగుతాయి. టీ20 క్రికెట్ పట్ల మక్కువ ఉన్నా ఆటగాళ్లు కౌంటీలలో ఆడేందుకు మక్కువ చూపుతారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడే ఆటగాళ్లు కూడా మ్యాచ్లు లేనప్పుడు కౌంటీలు ఆడతారు. కానీ మనకు మాత్రం అలా లేదు. అంతర్జాతీయ స్థాయిలో ఆడే క్రికెటర్లలో ఎంతమంది డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నారు..?’ అని ప్రశ్నించాడు.