BGT 2024-25 : ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా స్క్వాడ్ను ప్రకటించింది. పెర్త్లో జరుగబోయే తొలి టెస్టు కోసం యువకెరటాలు నాథన్ మెక్స్వీనే(Nathan McSweeney), టీ20 చిచ్చరపిడిగు జోష్ ఇంగ్లిస్ (Josh Inglis)లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దాంతో, సుదీర్ఘ ఫార్మాట్లో ఈ ఇద్దరి అరంగేట్రం చేసే అవకాశముంది.
ఆదివారం ఆసీస్ క్రికెట్ 13 మందితో కూడిన స్క్వాడ్ను వెల్లడించింది. అందులో ఇంగ్లిస్, మెక్స్వీనేలు మాత్రమే కొత్త ముఖాలు కావడం విశేషం. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆధ్వర్యంలో హేజిల్వుడ్, స్టార్క్, బోలాండ్లతో కూడిన పేస్ దళం భారత జట్టుకు సవాల్ విసరేందుకు సిద్ధమవుతోంది.
SQUAD 🤩 The Border-Gavaskar Trophy is almost upon our men’s national team, with 13 of our very best ready and raring to face India in Perth later this month #AUSvIND pic.twitter.com/QbRVJNmllw
— Cricket Australia (@CricketAus) November 9, 2024
ఆస్ట్రేలియా స్క్వాడ్ : ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్వీనే, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
ఇండియా ‘ఏ’తో జరిగిన అనధికార టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టు తరఫున మెక్స్వీనే దంచికొట్టాడు. ఓపెనర్గా వచ్చిన అతడు భారత బౌలర్లను ఉతికేస్తూ 88 నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో భాగమయ్యాడు. కుడి చేతివాటం బ్యాటర్, స్పిన్నర్ కూడా అయిన ఈ యంగ్స్టర్ ఆసీస్ సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దాంతో, ఖవాజాకు జోడీగా అతడు పెర్త్లో ఇన్నింగ్స్ ఆరంభించే వీలుంది. లేదంటే టీ20ల్లో రెచ్చిపోయి ఆడుతున్న ఇంగ్లిస్ ఓపెనర్ అవతారం ఎత్తిన ఆశ్చర్యమేమీ లేదు.
నవంబర్ 22న భారత్, ఆసీస్ల మధ్య బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ షురూ కానుంది. 1999 అనంతరం తొలిసారిగా ఈ ట్రోఫీ ఐదు మ్యాచ్లుగా నిర్వహిస్తున్నారు. వరుసగా రెండు పర్యాయాలు కంగారూల గడ్డపై ఈ ట్రోఫీ గెలుపొందిన భారత జట్టు హ్యాట్రిక్ కొట్టేందుకు తహతహలాడుతోంది. మరోవైపు మూడోసారి ఓటమిని తప్పించుకునేందుకు ప్యాట్ కమిన్స్ సేన గట్టి పట్టుదలతో పోరాడనుంది.