బీసీసీఐ కార్యదర్శిగా రెండోసారి పదవీ బాధ్యతలు అందుకున్న జై షాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆధిపత్య ధోరణితో తాము ఆడిందే ఆట అన్న రీతిలో వ్యవహరించడం భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య వైరాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్లో జరుగాల్సిన ఆసియాకప్లో తాము బరిలోకి దిగమంటూ షా వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది. తటస్థ వేదికలపైనే పాక్తో తలపడుతామంటూ జై షా అన్న మాటలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అంతే దీటుగా స్పందించింది. ఆసియాకప్లో మీరు(భారత్) ఆడకుంటే వచ్చే ఏడాది భారత్లో జరిగే వన్డే ప్రపంచకప్ నుంచి తప్పుకుంటామంటూ హెచ్చరికలు చేసింది. జై షా వ్యాఖ్యలు ఆసియాలోనే కాదు అంతర్జాతీయ క్రికెట్లోనూ చీలిక తీసుకొచ్చేలా ఉన్నాయని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా అన్నాడు. ఈ విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అత్యవసర భేటీ అయి సమస్యను పరిష్కరించాలని సూచించాడు.
లాహోర్ : బీసీసీఐ కార్యదర్శిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన జై షా మాటలు మంటలు రేపుతున్నాయి. ఆసియాకప్లో పాల్గొనేందుకు భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించదని, తటస్థ వేదికలపైనే మ్యాచ్లు ఆడుతుందని షా చేసిన ప్రకటన వివాదానికి ఆజ్యం పోసింది. వచ్చే ఏడాది ఆసియా కప్ నిర్వహణ హక్కులను పాకిస్థాన్ సొంతం చేసుకుంది. దీనిపై ఇప్పటి వరకు బీసీసీఐ మౌనంగా ఉంది. అయితే మంగళవారం వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్) సందర్భంగా జై షా ఆసియాకప్లో పాల్గొనే భారత జట్టు పాక్లో పర్యటించదన్న వ్యాఖ్య పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ను ఆగ్రహానికి గురిచేసింది. ఆసియాకప్లో ప్రధాన జట్లుగా భావించే ఇండియా, పాకిస్థాన్ల మధ్య పోరు క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తుందన్నది జగమెరిగిన సత్యం. రెండు దేశాల మధ్య రాజకీయ విభేదాల కారణంగా తటస్థ వేదికలపై మినహా భారత్, పాక్ జట్లు ముఖాముఖి తలపడింది లేదు. దశాబ్ద కాలంపైగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ల ఊసే లేదు. ఈ నేపథ్యంలో జై షా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమ దేశంలో జరిగే ఆసియాకప్లో భారత జట్టు పాల్గొనకపోతే వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్లో తామూ పాల్గొనమని పీసీబీ చైర్మన్ రమీజ్రాజా హెచ్చరికలు జారీచేశాడు. జై షా చేసిన వ్యాఖ్యలు ఆసియా క్రికెట్తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో చీలికలు తీసుకొచ్చేలా ఉన్నాయంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. ఏసీసీ అధ్యక్ష హోదాలో జై షా..పీసీబీ అభ్యర్థనను ఏమేరకు గౌరవిస్తాడన్నది వేచిచూడాలి.
2023 ఆసియాకప్ నిర్వహణ హక్కులు పాకిస్థాన్ దక్కించుకుంది. గత ఆసియాకప్ను శ్రీలంక నిర్వహించాల్సి ఉండగా ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా గత నెలలో యూఏఈలో నిర్వహించారు. అదీ కూడా టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. 2018లో స్వదేశంలో నిర్వహించాల్సిన ఆసియాకప్ కూడా భారత ప్రభుత్వం పాకిస్థాన్ క్రికెటర్ల భద్రతపై తగిన హామీ ఇవ్వకపోవడంతో ఆ టోర్నీని కూడా యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే.
భారత్లో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో పాకిస్థాన్తో సంబంధాలు దెబ్బతిన్నాయి. దాని ప్రభావం ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై కూడా చూపింది. భారత జట్టు చివరిసారిగా పాకిస్థాన్లో 2008లో పర్యటించగా, పాక్ 2012-13లో భారత్లో ఆడింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగింది లేదు. ఈ నేపథ్యంలో జై షా నిర్ణయం ఏకపక్షంగా ఉందని పీసీబీ మండిపడింది. ఆసియాకప్ నిర్వహణ హక్కులు పాకిస్థాన్కు కట్టబెట్టినపుడు ఏసీసీలోని సభ్యదేశాలు తమకు మద్దతు తెలిపాయని, ఇప్పుడు జై షా ఏకపక్ష నిర్ణయంతో ఏసీసీలో విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉందని పీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది. తమతో సంప్రదించకుండానే ఆసియాకప్ వేదికను మారుస్తామని జై షా వ్యాఖ్యానించడంపై పీసీబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే ప్రసార హక్కులు, ఇతర వాణిజ్య ఒప్పందాలు ఖరారు చేసుకున్నామని, ఈ తరుణంలో వేదిక మార్పు ఆర్థికంగా తమను దెబ్బతీస్తుందని పీసీబీ అంటున్నది. వేదిక మార్పు విషయమై తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని, అందుకే ఏసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని పీసీబీ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు.
వచ్చే నెలలో మెల్బోర్న్లో ఐసీసీ బోర్డు సమావేశం కానున్నది. ఆ భేటీలో ఈ విషయాన్ని లేవనెత్తాలని పీసీబీ యోచిస్తున్నది. ఈ అంశంపై ఐసీసీ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. భారత్, పాకిస్థాన్ జట్లలో ఏ ఒక్కటి లేకపోయినా టోర్నీ నిర్వహణలో అర్థం లేదని, అందుకే ఈ అంశాన్ని ఇరు దేశాల బోర్డులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఏసీసీ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. అయితే ఆసియాకప్ మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు పీసీబీ సుముఖంగా లేదు. చాలాకాలం తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ దేశాలు తమ గడ్డపై ఆడినప్పుడు భారత జట్టు ఎందుకు అభ్యంతరం చెపుతుందన్నది పీసీబీ వాదన. బీసీసీఐ వ్యాఖ్యలు ఏసీసీ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శిస్తున్నది. తమ దేశంలో ఆసియాకప్లో పాల్గొనేందుకు భారత జట్టు నిరాకరిస్తే, ప్రపంచకప్నకు తమ జట్టును పంపేది లేదని పీసీబీ ఖరాఖండిగా చెబుతున్నది. ఐసీసీ టోర్నీలలో భారత్, పాకిస్థాన్ల మధ్య మ్యాచ్కున్న ఆదరణ ఇంకే మ్యాచ్కు ఉండదన్నది నిజం.