హైదరాబాద్ : రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక) ద్వారా అండర్ పాస్లు, ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నారు. ఎస్ఆర్డీపీ ద్వారా నిర్మించిన బాలానగర్ ప్లై ఓవర్ల ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. ఈ విషయాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
1.13 కిలోమీటర్ల మేర నిర్మించిన బాలానగర్ ఫ్లై ఓవర్ను మంగళవారం ప్రారంభించనున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ టీమ్కు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.385 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు, 24 మీటర్లు వెడల్పు 26 పిల్లర్లతో నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఒకటి, 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇది. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేశారు. దీనికి బాబూ జగజ్జీవన్రామ్ బ్రిడ్జిగా నామకరణం చేయనున్నారు.