Kento Momota : మాజీ వరల్డ్ నంబర్ 1 కెంటో మెమొటా(Kento Momota) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 29 ఏండ్లకే తనకెంతో ఇష్టమైన ఆటకు ఈ జపాన్ స్టార్ వీడ్కోలు పలికాడు. ప్యారిస్ ఒలింపిక్స్(Pairs Olympics 2024) బెర్త్ కోల్పోయిన మెమొటా గురువారం బ్యాడ్మింటన్లో తన సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికేశాడు. ఇన్నాళ్లు ఆడడం వల్ల మానసికంగా, శారీరకంగా అలిసిపోయాను అని అతడు వెల్లడించాడు. దాంతో, ఏప్రిల్ 27 నుంచి జరుగబోయే థామస్, ఉబెర్ కప్లో మెమొటా లేకుండానే జపాన్ జట్టు బరిలోకి దిగనుంది.
‘నేను ఎంతగానో ప్రయత్నించినా మానసికంగా, శారీరకంగా ఏర్పడిన లోటును పూడ్చలేకపోయాను. మళ్లీ వరల్డ్ నంబర్ 1 కాలేనని అనిపించింది. నాకు ఈమధ్యే కంటి సర్జరీ జరిగింది. దాంతో, బాగా చూడలేకపోతున్నా. అంతేకాదు గతంలో మాదిరిగా కోర్టులో హుషారుగా కదలేకపోతున్నా. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి చూశా. కానీ, ఇక ఎంతో కాలం నేను బ్యాడ్మింటన్ ఆడలేననే విషయాన్ని గ్రహించాను’ అని మెమొటా తన వీడ్కోలు ప్రసంగంలో చెప్పాడు.
కెంటో మెమొటా
జపాన్ తరఫున బ్యాడ్మింటన్లో రికార్డులు బద్ధలు కొట్టిన మెమొటా 2018 -19 మధ్య పలు టైటిళ్లు నెగ్గాడు. ఆ సమయంలో భీకర ఫామ్లో ఉన్న మెమొటా వరల్డ్ చాంపియన్షిష్ టైటిల్తో పాటు ఏకంగా 11 ట్రోఫీలు సాధించాడు. అయితే.. 2020 జనవరిలో కారు ప్రమాదంలో సైతం అతడి కెరీర్పై ప్రభావం చూపలేకపోయింది. చిన్న చిన్న గాయాలతో బయటపడిన మెమొటా.. అనంతరం మూడు టైటిళ్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 52వ ర్యాంకర్ అయిన మెమొటా ఒలింపిక్స్ బెర్తు సాధించలేకపోయాడు. దాంతో, ఇక ఆడి ప్రయోజనం లేదనే ఉద్దేశంతో అతడు రిటైర్మెంట్ నిర్ణయానికి వచ్చాడు.