కల్యాణి(పశ్చిమబెంగాల్): సుదీర్ఘ నేపథ్యం కల్గిన రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ కొత్త చరిత్ర లిఖించింది. అరంగేట్రం చేసిన 67 ఏండ్ల తర్వాత తొలిసారి టోర్నీలో ఫైనల్ చేరి ఔరా అనిపించింది. మేటి జట్లను మట్టికరిపిస్తూ టైటిల్ పోరులో నిలిచింది. రెండు సార్లు చాంపియన్ బెంగాల్తో జరిగిన సెమీఫైనల్లో జమ్మూకశ్మీర్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ బెంగాల్ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యఛేదన కోసం నాలుగో రోజు బుధవారం ఓవర్నైట్ స్కోరు 43/2తో బ్యాటింగ్కు దిగిన జమ్మూకశ్మీర్ 34.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. 12 పరుగుల ఓపెనర్లు ఖజురియా(1), హసన్ (6) వికెట్లు కోల్పోయిన జట్టును ఓవర్నైట్ బ్యాటర్లు శుభమ్ పందిర్(27), వంశజ్ శర్మ(43 నాటౌట్) ఆదుకున్నారు. సీనియర్ స్పీడ్స్టర్ మహ్మమద్ షమీ నేతృత్వంలోని బెంగాల్ బౌలింగ్ దాడిని నిలువరిస్తూ లక్ష్యం వైపు వడివడిగా సాగారు. పందిర్తో పాటు కెప్టెన్ పారస్ డోగ్రా(9) వెంటవెంటనే ఔటైనా..అబ్దుల్ సమద్(27 బంతుల్లో 30 నాటౌట్, ఫోర్, 3సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.
టీమ్ఇండియాకు ఆడిన షమీ, ఆకాశ్దీప్, ముకేశ్కుమార్, షాబాజ్ అహ్మద్ లాంటి బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ బౌండరీలు బాదాడు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్కు అజేయంగా 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముకేశ్ బౌలింగ్లో లాంగ్ఆన్లో సిక్స్ కొట్టి వంశజ్ మ్యాచ్ను ఘనంగా ముగించాడు. ఆకాశ్దీప్(3/46) మూడు వికెట్లు దక్కాయి. తొమ్మిది వికెట్లతో జట్టు చారిత్రక విజయంలో కీలకంగా వ్యవహరించిన అకీబ్ నబీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.