హైదరాబాద్, ఆట ప్రతినిధి: గ్రూపు రాజకీయాలు, వర్గపోరు, వివాదాలతో ఇన్నాళ్లు కొట్టుమిట్టాడిన జాతీయ హ్యాండ్బాల్ సంఘాన్ని అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు ఒడ్డుకు పడేశారు. జగన్ సారథ్యంలోని హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఏఐ)కు జాతీయ క్రీడా సంఘంగా గుర్తింపునిస్తూ కేంద్ర క్రీడాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో జస్టిస్ దీపక్కుమార్ శ్రీవాత్సవ్ పర్యవేక్షణలో కొత్తగా ఎన్నికైన హెచ్ఏఐ కార్యవర్గాన్ని ఆమోదిస్తున్నట్లు క్రీడాశాఖ పేర్కొంది. దీని ప్రకారం హెచ్ఏఐ అధ్యక్షుడిగా దిగ్విజయ్ చౌతాలా, ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్రావు, కోశాధికారిగా తేజ్రాజ్సింగ్ ఎన్నికను ధృవీకరించినట్లు తెలిపింది. ఇక నుంచి దేశంలో హ్యాండ్బాల్ కార్యకలపాలను హెచ్ఏఐ నిర్వహిస్తుందని స్పష్టం చేసింది.
జగన్కు అభినందనల వెల్లువ
హెచ్ఏఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జగన్మోహన్రావుకు అభినందనలు వెల్లువెత్తాయి. మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కవిత, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ట్విట్టర్లో జగన్కు అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డ సారథ్యంలో జాతీయ హ్యాండ్బాల్ సంఘానికి గుర్తింపు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గత రెండేండ్లుగా తన నాయకత్వంపై విశ్వాసం ఉంచిన అందరికీ ఈ సందర్భంగా జగన్ కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జాతీయ హ్యాండ్బాల్ సంఘంలో గ్రూపు రాజకీయాల శాశ్వత ముగింపు పలికామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర క్రీడాశాఖల మద్దతుతో హ్యాండ్బాల్కు కొత్త జోష్ తీసుకొస్తామన్నారు.