సిక్సర్ల సునామీ.. బౌండ్రీల జడివాన.. పరుగుల తుఫాన్.. ఈ ఉపమానాలన్నీ ఆ ఇన్నింగ్స్ ముందు దిగదుడుపే! బౌండ్రీలు బాదడమే ఏకైక లక్ష్యమైనట్లు.. బౌలర్ల భరతం పట్టడమే పనిగా పెట్టుకున్నట్లు.. ప్రత్యర్థిపై కనీస కనికరం లేనట్లు.. ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టాలని కంకణం కట్టుకున్నట్లు తమిళనాడు ఓపెనర్ నారాయణ్ జగదీశన్ శివ తాండవమాడటంతో.. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై తమిళనాడు భారీ విజయం సాధించింది!
లిస్ట్-ఏ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ (264) రికార్డును తిరగరాసిన జగదీశన్.. ఓవరాల్గా టాప్లో నిలిచాడు. ఈ దెబ్బతో లిస్ట్-ఏలో ఐదొందల పరుగులు చేసిన తొలి జట్టుగా తమిళనాడు చరిత్రకెక్కగా.. అరుణాచల్ ప్రదేశ్ 435 పరుగుల భారీ తేడాతో పరాజయం మూటగట్టుకుంది. తాజా టోర్నీలో ఇప్పటికే నాలుగు సెంచరీలు చేసి ఫుల్ జోష్లో ఉన్న జగదీశన్.. చిన్నస్వామిలాంటి చిన్న స్టేడియంలో పసికూన అరుణాచల్పై తన కసి తీర్చుకుంటూ పాంచ్ పటాకా మోగించాడు.
బెంగళూరు: యువ ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (141 బంతుల్లో 277; 25 ఫోర్లు, 15 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో విజయ్ హజారే టోర్నీలో తమిళనాడు భారీ విజయం నమోదు చేసుకుంది. ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా సోమవారం జరిగిన పోరులో తమిళనాడు 435 పరుగుల తేడాతో అరుణాచల్ ప్రదేశ్ను చిత్తు చేసింది. పరుగుల పరంగా లిస్ట్-ఏ (అంతర్జాతీయ, దేశవాళీ వన్డేలు) క్రికెట్లో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. లిస్ట్-ఏల్లో ఇదే అత్యధిక స్కోరు కాగా.. 26 ఏండ్ల జగదీశన్ ఈ టోర్నీలో వరుసగా ఐదో సెంచరీ నమోదు చేసుకున్నాడు. జగదీశన్ క్రీజులో ఉన్నంతసేపు.. ఆటగాళ్లు ప్రేక్షకులు కాగా.. అంపైర్లు డ్రిల్ మాస్టర్లుగా మిగిలిపోయారు. అతడితో పాటు మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (102 బంతుల్లో 154; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దంచికొట్టడంతో తమిళనాడు రికార్డు స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో పలు జాతీయ, అంతర్జాతీయ రికార్డులు తునాతునకలయ్యాయి. అనంతరం భారీ లక్ష్యఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 28.4 ఓవర్లలో 71 పరుగులకు ఆలౌటైంది. ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. తమిళనాడు బౌలర్లలో సిద్ధార్థ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ వేలం జరుగనుండగా.. ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ వదిలేసుకున్న జగదీశన్ను తిరిగి ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరం.
లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా జగదీశన్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇంగ్లిష్ క్రికెటర్ అలిస్టర్ బ్రౌన్ (268 కౌంటీల్లో), భారత కెప్టెన్ రోహిత్ శర్మ (264, శ్రీలంకపై)ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.
లిస్ట్-ఏ (అంతర్జాతీయ, దేశవాళీ వన్డేలు) క్రికెట్లో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు (506/2) ఇదే. గతంలో
ఈ రికార్డు ఇంగ్లండ్ (498,నెదర్లాండ్స్పై) పేరిట ఉంది.
విజయ్ హజారే ట్రోఫీలో జగదీశన్కు ఇది వరుసగా ఐదో సెంచరీ. లిస్ట్-ఏ క్రికెట్లో వరుసగా 5 శతకాలు బాదిన తొలి ఆటగాడిగా జగదీశన్ చరిత్రకెక్కాడు. కుమార సంగక్కర (శ్రీలంక), అల్విరో పీటర్సన్ (దక్షిణాఫ్రికా), భారత యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ నాలుగేసి సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు.
తొలి శతకం నమోదు చేసేందుకు 76 బంతులు తీసుకున్న జగదీశన్.. రెండో సెంచరీని కేవలం 38 బంతుల్లోనే పూర్తి చేశాడు. డబుల్ సెంచరీలో రెండో అర్ధభాగాన్ని తక్కువ బంతుల్లో పూర్తి చేయడం లిస్ట్-ఏ క్రికెట్లో రికార్డు.
లిస్ట్-ఏ క్రికెట్లో పరుగుల పరంగా అత్యంత (435 పరుగుల తేడాతో) భారీ విజయం నమోదు చేసుకున్న జట్టుగా తమిళనాడు చరిత్రకెక్కింది.
జగదీశన్ తొలి వికెట్కు సాయి సుదర్శన్తో కలిసి 416 పరుగులు జోడించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఏ వికెట్కైనా ఇదే అత్యధికం. గేల్,సామ్యూల్స్ (372,2015లో జింబాబ్వేపై) భాగస్వామ్యం రెండో స్థానంలో ఉంది.
విజయ్ హజారే ట్రోఫీ ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు (15) కొట్టిన ఆటగాడిగా జగదీశన్
రికార్డుల్లోకెక్కాడు. యశస్వి జైస్వాల్ (12) రెండో స్థానంలో ఉన్నాడు.
చాలా ఆనందంగా ఉంది. ఈ ఒక్క మ్యాచ్ అనే కాదు.. క్రీజులో అడుగుపెట్టిన ప్రతిసారి భారీ ఇన్నింగ్స్ ఆడాలనే అనుకుంటా. నా మదిలో ఎప్పుడూ వన్డే క్రికెట్ తిరుగుతూనే ఉంటుంది. మ్యాచ్ సాగుతున్నప్పుడు రికార్డుల గురించి ఆలోచించలేదు. ఫిట్నెస్తో పాటు బ్యాటింగ్పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతోనే ఇది సాధ్యమైంది.
– జగదీశన్
సంక్షిప్త స్కోర్లు
తమిళనాడు: 50 ఓవర్లలో 506/2 (సాయి సుదర్శన్ 154, జగదీశన్ 277; డోరియా 1/27),
అరుణాచల్: 28.4 ఓవర్లలో 71 ఆలౌట్ (యాంగ్ఫో 17; సిద్ధార్థ్ 5/12, మహమ్మద్ 2/3).