IND vs NZ | ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. వాంఖడే వేదికగా ఆతిథ్య భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ పోరుకు వేళయైంది. మెగాటోర్నీలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిచిన జట్టు టీమ్ఇండియా అయితే..వరుసగా నాలుగు విజయాలతో దుమ్మురేపి ఆపై నాలుగు ఓటములతో ఆఖరి బెర్తు దక్కించుకున్న టీమ్ కివీస్. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ అజేయంగా సెమీస్ పోరులో నిలిచింది భారత్. ఇదే జోరులో కివీస్ భరతం పట్టాలని రోహిత్సేన మంచి కసి మీదుంది.
సొంత ఇలాఖాలో ఎలాగైనా కప్ కలను తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతున్నది. పన్నెండేండ్ల తర్వాత ప్రపంచకప్ను దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నది.సరిగ్గా నాలుగేండ్ల క్రితం మాంచెస్టర్లో ఇదే కివీస్ చేతిలో ఓటమి ఎదుర్కొన్న మనోళ్లు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కోట్లాది మంది ఆశలను మోసుకుంటూ బరిలోకి దిగుతున్న భారత్..ప్రపంచకప్ను అందుకునేందుకు మరో రెండడుగుల దూరంలో ఉన్నది. మరి మన కల నెరవేరుతుందా లేదా అనేది కొన్ని గంటల్లో తేలనుంది.
ముంబై: వన్డే ప్రపంచకప్లో అసలు సిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. ఇన్ని రోజులు లీగ్ దశ మ్యాచ్లు అభిమానులకు ఆసక్తి కల్గించగా, నాకౌట్ పోరు మెగాటోర్నీని మరో రేంజ్కు తీసుకెళ్లనున్నాయి. చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలకమైన సెమీఫైనల్ పోరు జరుగనుంది. లీగ్ దశలో కివీస్ను చిత్తుచేసిన టీమ్ఇండియా అదే ఆత్మవిశ్వాసంతో మరోమారు విజయంతో ఫైనల్ బెర్తు దక్కించుకోవాలని చూస్తున్నది. ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో రోహిత్సేన అజేయంగా నిలువగా, కివీస్ ఐదు విజయాలు, నాలుగు ఓటములతో నాలుగో స్థానంతో నాకౌట్ రేసులో నిలిచింది. ప్రస్తుత టోర్నీతో కలిపి ఇప్పటి వరకు టీమ్ఇండియా ఎనిమిది సార్లు సెమీఫైనల్కు అర్హత సాధించింది.
ఇందులో రెండుసార్లు(1983, 2011) ట్రోఫీ కైవసం చేసుకుంది. స్వదేశంలో చివరిసారి జరిగిన వన్డే ప్రపంచకప్లో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలో తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకుంది. మొహాలీ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన సెమీస్ పోరులో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. అయితే నాలుగేండ్ల క్రితం మాంచెస్టర్లో జరిగిన మెగాటోర్నీ సెమీస్లో కివీస్..టీమ్ఇండియాను నాకౌట్ చేసింది. గప్టిల్ డైరెక్ట్ హిట్తో ధోనీని రనౌట్ చేయడం మ్యాచ్ గతిని మార్చేసింది.
జడేజా ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. ఇప్పుడు అదే కివీస్..మళ్లీ సెమీస్లో ఎదురైంది. ఇప్పుడు మన ముంబైలో న్యూజిలాండ్ను మట్టికరిపించే అవకాశం వచ్చింది. మెగాటోర్నీలో ఇప్పుడున్న జోరును టీమ్ఇండియా కొనసాగిస్తే మనల్ని అడ్డుకోవడం ఏ జట్టుకైనా అసాధ్యంగా కనిపిస్తున్నది. అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో మనోళ్లు దుమ్మురేపుతున్న వైనం ముచ్చటగా మూడోసారి కప్ను అందుకునేలా కనిపిస్తున్నది.
ఏ నిమిషానా ప్రపంచకప్ ప్రస్థానాన్ని భారత్ మొదులపెట్టిందో గానీ అవిఘ్నంగా సాగుతున్నది. చెన్నైలో ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాపై అద్భుత విజయంతో కదంతొక్కిన రోహిత్సేన..మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వరుసగా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ ఇలా అందరి భరతం పట్టింది. అటు బ్యాటింగ్ అయినా..ఇటు బౌలింగ్ అయినా కేక పుట్టిస్తూ పరాజయం అన్నది లేకుండా దూసుకెళుతున్నది.
మెగాటోర్నీలో 594 పరుగులతో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరి కంటే టాప్లో కొనసాగుతుంటే కెప్టెన్ రోహిత్శర్మ(503) జోరు కనబరుస్తున్నారు. వీరిద్దరిలో ఏ ఒక్కరూ కుదురుకున్నా..కివీస్ పని అయిపోయినట్లే. బౌలింగ్ విషయానికొస్తే..లేట్గా వచ్చినా లేటెస్టుగా వచ్చినట్లు షమీ స్వింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. షమీకి తోడు సిరాజ్, బుమ్రా చెలరేగితే కివీస్ను ఓడించడం పెద్ద కష్టమేమి కాదు. జడేజా, కుల్దీప్యాదవ్ తమ స్పిన్తో వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. మొత్తంగా మరోమారు సమిష్టి ప్రదర్శన కనబరిస్తే..మనకు అహ్మదాబాద్ టిక్కెట్ కన్ఫామ్ అయినట్లే.
మెగాటోర్నీలో కివీస్ ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతున్నది. తమ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను ఓడించిన కివీస్..నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్పై గెలిచి జోరు కనబరిచింది. ఆ తర్వాత వరుసగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ చేతుల్లో ఓటములు ఎదుర్కొంది. సెమీస్కు అర్హత సాధిస్తుందా లేదా అన్న అనుమానాల మధ్య మెరుగైన రనౌట్తో నాకౌట్లోకి ప్రవేశించింది. కెప్టెన్ విలియమ్సన్ తిరిగి జట్టులో చేరడం ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగా నిలకడలేమి ఆ జట్టును కలవరపెడుతున్నది.
1 వన్డేల్లో 50 సెంచరీల మార్క్కు విరాట్ కోహ్లీ మరో సెంచరీ దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్(49)తో కలిసి సమంగా కొనసాగుతున్నాడు.
భారత్: రోహిత్శర్మ(కెప్టెన్), గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, షమీ, కుల్దీప్యాదవ్, బుమ్రా, సిరాజ్.
న్యూజిలాండ్: విలియమ్సన్(కెప్టెన్), కాన్వె, రచిన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, చాప్మన్, సాంట్నర్, సౌథీ, ఫెర్గుసన్, బౌల్ట్.