వాంఖడే: ఐపీఎల్ 2021 సీజన్లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), యువ ఆటగాడు రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) వాంఖడే వేదికగా శనివారం రాత్రి తలపడనున్నాయి. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లేఆఫ్స్కు చేరుకోలేని పరాభవాన్ని గతేడాది చవిచూసిన ధోనీసేన మళ్లీ పుంజుకోవాలని కసిగా ఉంటే.. గత సీజన్లో ఫైనల్ చేరిన క్యాపిటల్స్ మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. రెండు జట్లు అన్ని విభాగాల్లో బలంగా ఉండటంతో సీజన్ రెండో మ్యాచ్లో గురు, శిష్యుల పోరు రసవత్తరంగా సాగనుంది.
ఇటీవల ఇంగ్లాండ్తో సిరీస్లో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, పంత్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ సూపర్ ఫామ్లో ఉండటం ఢిల్లీ జట్టులో ఎనలేని ఉత్సాహాన్ని నింపుతోంది. టీమిండియాకు మ్యాచ్ విన్నర్గా మారిన పంత్ అదే రీతిలో ఆడితే ఢిల్లీకి తిరుగుండదు. మరోవైపు డాడీస్ ఆర్మీగా పేరొందిన చెన్నై జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఇటీవలి కాలంలో పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడలేదు. ధోనీ, జడేజా, రైనా, రాయుడు డ్వేన్ బ్రావో చాలా రోజుల తర్వాత పొట్టి క్రికెట్ ఆడబోతున్నారు. గాయం నుంచి కోలుకున్న జడ్డూ నేటి మ్యాచ్ ఆడతాడో లేదో అనుమానంగా మారింది. ధోనీ వ్యూహాల ముందు పంత్ సైన్యం ఏమేరకు రాణిస్తుందో చూడాలి!