న్యూఢిల్లీ: నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్తో తిరిగి మ్యాట్పైకి వచ్చేందుకు సిద్ధమవుతున్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) షాకిచ్చింది. గతేడాది చివర్లో అవుట్-ఆఫ్-కాంపిటీషన్ డోపింగ్ పరీక్షకు అందుబాటులో ఉండనందుకు గానూ ఆమెకు నోటీసులు జారీ చేసింది.
గత డిసెంబర్ 18న హర్యానా అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిమిత్తం వినేశ్ చండీగఢ్ వెళ్లింది. కానీ, ఆ సమాచారాన్ని ఆమె సకాలంలో అప్డేట్ చేయకపోవడం వల్ల డోపింగ్ నియంత్రణ అధికారికి అందుబాటులో లేకుండా పోయింది.
దీనిపై ఆమె ఇచ్చిన వివరణను తోసిపుచ్చిన ఐటీఏ వినేశ్ డోప్ టెస్టుకు గైర్హాజరైందని అధికారికంగా నమోదు చేసింది. గత 12 నెలల కాలంలో ఫొగాట్ తొలిసారి తన లొకేషన్ వివరాలు తెలపడంలో (వేర్ అబౌట్స్) విఫలమైంది. ఏడాదిలో ఇలాంటి మూడు వేర్ అబౌట్స్ వైఫల్యాలు నమోదైతేనే దానిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి గరిష్టంగా రెండేళ్ల వరకు నిషేధం విధిస్తారు. అయితే, ఈ నోటీసు డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని, హెచ్చరిక మాత్రమేనని ఐటీఏ తెలిపింది.