బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తాజా సీజన్లో టైటాన్స్ వరుసగా ఆరో మ్యాచ్లో ఓటమి పాలవడం గమనార్హం. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 31-39తో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడింది. స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ 14 పాయింట్లతో సత్తాచాటినా.. అతడికి సహచరుల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో టైటాన్స్ పరాజయం తప్పలేదు. తలైవాస్ తరఫున అజింక్య (12 పాయింట్లు), సాగర్ (8 పాయింట్లు), హిమాంశు సింగ్ (7 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 45-40తో గుజరాత్ జెయింట్స్ను ఓడించగా, యూపీ యోధాస్, హర్యానా స్టీలర్స్ మ్యాచ్ 36-36తో టైగా ముగిసింది.