Sunil Gavaskar : ఆసియా కప్(Asia cup 2023)లో బోణీ కొట్టిన భారత జట్టు సూపర్ 4(Super 4) మ్యాచ్లపై దృష్టి పెట్టింది. గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించిన కేఎల్ రాహుల్(KL Rahul) రాకతో బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. అంతేకాదు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), ఇషాన్ కిషన్(Ishan Kishan) రూపంలో నాణ్యమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఉన్నారు. అయితే.. ఈ ముగ్గురిలో తుది జట్టులో ఎవరు ఉంటారు? అనే ప్రశ్న మొదలైంది. దీనికి లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఆసక్తికర సమాధానం చెప్పాడు.
‘మిడిలార్డర్లో నంబర్ 4, నంబర్ 5 స్థానం కోసం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మధ్యే గట్టి పోటీ ఉంటుంది. అయితే.. పాకిస్థాన్పై ఇషాన్ కిషన్(82) హాఫ్ సెంచరీ బాదిన తీరు అద్భుతం. ఒకవేళ రాహుల్, ఇషాన్లను తుది జట్టులోకి తీసుకుంటే.. ఇషాన్కు వికెట్ కీపింగ్ అప్పగించాలి. ఎందుకంటే..? పునరాగమనం తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న రాహుల్పై అదనపు భారం పడకుండా చూడొచ్చు’ అని లిటిల్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.
ఇషాన్ కిషన్
అంతేకాదు ప్రపంచ కప్(ODI World Cup 2023) తుది జట్టులో ఇషాన్ కిషన్, రాహుల్ ఉండడం మంచి నిర్ణయమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రాహుల్ ఐదో స్థానంలో విలువైన ఇన్నింగ్స్లు ఆడాడని గుర్తు చేశాడు. అందుకని అతడు వరల్డ్ కప్లో భారత విజయాల్లో కీలకం అవుతాడని కూడా గవాస్కర్ అన్నాడు.
‘రాహుల్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. అయితే.. ఈ ఐదు నెలల్లో అతను క్రికెట్ ఆడలేదు. ఆసియా కప్ కోసం శ్రీలంకకు వచ్చాడు. అతడు మునపటిలా ఆడాలంటే మరిన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు అవసరం. సెప్టెంబర్లోనే ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఆ సిరీస్ రాహుల్కు కీలకం కానుంది. ఆసీస్పై రాణించిన వాళ్ల కోసం వరల్డ్ కప్ స్క్వాడ్లో మార్పులు చేసినా పర్లేదు’ అని గవాస్కర్ వెల్లడించాడు.