Mohammad Kaif : రోహిత్ శర్మ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. జట్టులోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో రోహిత్ చాలా క్లారిటీతో ఉన్నాడని అన్నాడు. శ్రీలంకతో తొలి రెండు వన్డేల్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి హిట్టర్లను కాదని కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్లను ఆడించడం తెలివైన నిర్ణయమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. వన్డేల్లో దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్లను ఆడిస్తున్నాడు అని తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్తో మాట్లాడుతూ.. ‘ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు టెంప్ట్ చేస్తారు. అయితే.. రోహిత్ ఏమాత్రం తొందరపడడం లేదు. ప్లేయర్స్కు ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం ఇవ్వాలని రోహిత్ అనుకుంటున్నాడు. ఇషాన్, సూర్య, గిల్, రాహుల్.. ఈ నలుగురు బాగా ఆడుతున్నారు. తుది జట్టులోకి వీళ్లలో ఇద్దరిని మాత్రమే తీసుకోవడం చాలా కష్టమైన పని. అయితే.. పోయిన ఏడాదిలో గిల్, రాహుల్ వన్డేల్లో అద్భుతంగా రాణించారు’ అని కైఫ్ అన్నాడు.
తొలి వన్డేలో శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇద్దరూ తొలి వికెట్కు 143 పరుగులు జోడించారు. గిల్ హాఫ్ సెంచరీ(70)తో రాణించాడు. రెండో వన్డేలోనూ దూకుడుగా ఆడే క్రమంలో 12 రన్స్కే వెనుదిరిగాడు. 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. ఐదో స్థానంలో వచ్చిన అతను తన సహజ ఆటకు భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. 93 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేశాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్తో కలిసి విలువైన రన్స్ చేశాడు. 64 రన్స్తో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. మూడో వన్డే రేపు (జనవరి 15న) తిరువనంతపురంలో జరగనుంది.