Saba Karim : కారు యాక్సిడెంట్లో గాయపడిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పంత్ సిరీస్ సమయాని కల్లా కోలుకోకపోతే అతని ప్లేస్లో ఎవరిని ఎంపిక చేయాలి? అని బీసీసీఐ సందిగ్ధంలో పడింది. వికెట్ల వెనక చురుగ్గా కదులుతూ, బ్యాటింగ్లో అదరగొట్టే ఆటగాడి కోసం చూస్తోంది. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్, ఓపెనర్ ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, ఉపేంద్ర యాదవ్ మధ్య పోటీ నెలకొంది. అయితే.. పంత్ స్థానంలో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ను సెలక్ట్ చేయాలని మాజీ క్రికెటర్ సబా కరీం అభిప్రాయపడ్డాడు. ‘టెస్టుల్లో కేఎస్ భరత్ మరింత మెరుగవ్వాలి. అందుకని పంత్ ప్లేస్లో ఇషాన్ కిషన్ సరిగ్గా సరిపోతాడని నా ఉద్దేశం. టెస్టుల్లో పంత్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయాలి’ అని సబా కరీం వెల్లడించాడు.
టీమిండియాకు టెస్టుల్లో పంత్ చాలా కీలక ఆటగాడు. అతను ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి వారెవ్వా అనిపించాడు. ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్టులో పంత్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 97 పరుగులు చేసి మ్యాచ్ చేజారకుండా కాపాడాడు. ఈమధ్యే ముగిసిన బంగ్లాదేశ్ సిరీస్లోనూ తానెంత విలువైన ఆటగాడు అనేది పంత్ మళ్లీ నిరూపించాడు. కోహ్లీ, కేఎల్ రాహుల్, పూజారా తడబడిన చోట దూకుడుగా ఆడి పరుగులు చేశాడు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో 93 రన్స్ చేసి జట్టు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఇషాన్ కిషన్ బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. పంత్లాగా దూకుడుగా ఆటగల నైపుణ్యం ఇషాన్ సొంతం. దాంతో, మాజీలు ఇషాన్వైపు మొగ్గు చూపుతున్నారు.