Ishan Kishan : భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) ఆటకు దూరమై మూడు నెలలు కావొస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటన(South Africa Tour)కు ఎంపికైన ఈ యంగ్స్టర్ అనూహ్యంగా సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ సిరీస్కూ దూరమయ్యాడు. అయితే.. సఫారీ సిరీస్ నుంచి ఇషాన్ అర్థాంతరంగా ఇండియా రావడానికి కారణం ఏంటనేది అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. ‘ఈ కుర్రాడికి ఏమైంది? ఎందుకు జట్టుకు దూరమయ్యాడు?’ అని చాలామంది చర్చించుకున్నారు. కానీ, ఇషాన్ సిరీస్ మధ్యలోనే స్వదేశానికి రావడానికి కారణం లేకపోలేదు.
సఫారీలతో టీ20 సిరీస్కు జితేశ్ శర్మ(Jitesh Sharma)ను ఎంపిక చేయడం ఇషాన్ను బాధించిందట. దాంతో, అక్కడ బెంచ్ మీద కూర్చోవడం ఇష్టం లేక అతడు భారత్కు వెళ్లాలని అనుకున్నాడు. తనకు కొన్ని రోజులు బ్రేక్ కావాలని మేనేజ్మెంట్తో చెప్పేసి భారత విమానం ఎక్కాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇషాన్ కిషన్
ఇంగ్లండ్ సిరీస్కు దూరమైన ఇషాన్ కమ్ బ్యాక్ కోసం కష్టపడుతున్నాడు. ఈ డాషింగ్ బ్యాటర్ బరోడా స్టేడియంలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. మాజీ వికెట్ కీపర్ కిరణ్మోరే అకాడమీ (Kiran More Academy)లో ఇషాన్ రాటుదేలుతున్నాడు.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఇరగదీసిన ఇషాన్.. వెస్టిండీస్ పర్యటనలో అదరగొట్టాడు. వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలతో రాణించాడు. దాంతో వరల్డ్ కప్ స్క్వాడ్లో ఈ యంగ్స్టర్కు చోటు దక్కింది. కానీ, శుభ్మన్ గిల్(Shubman Gill) రాకతో ఇషాన్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఒకవేళ అతడు మళ్లీ జట్టులోకి వచ్చినా యశస్వీ జైస్వాల్ సూపర్ ఫామ్లో ఉండడంతో ఓపెనర్గా చాన్స్ లేనట్టే. టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్న యశస్వీ.. వైజాగ్ టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం బుమ్రా సంచలన బౌలింగ్తో భారత్ అద్భుత విజయం సాధించింది.