ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్-15 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తో పాటు ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అచ్చిరాలేదు. ఈ మెగా టోర్నీకి ముందే అనూహ్యంగా సీఎస్కే సారథ్య బాధ్యతలు చేపట్టిన జడ్డూ.. 8 మ్యాచుల తర్వాత వాటిని తిరిగి ధోనికే అప్పజెప్పాడు. అనంతరం అతడు గాయం కారణంగా మొత్తం సీజన్ నుంచే వైదొలిగాడు. ఇలాఉండగా, జడేజా-సీఎస్కే మధ్య ఏదో జరుగుతున్నదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే సీఎస్కే యాజమన్యానికి జడేజాకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయని గత కొన్నిరోజులుగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా జడేజా చేసిన ఆ పనితో అవి నిజమేనని తేలిపోయింది. దశాబ్దకాలంగా సీఎస్కేకు ఆడుతున్న జడేజా.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి 2022 తో పాటు గతంలో తాను పోస్టు చేసిన సీఎస్కేకు సంబంధించిన పోస్టులన్నింటినీ డిలీట్ చేశాడు. దీంతో నెటిజన్లు, చెన్నై అభిమానులంతా సీఎస్కే-జడ్డూ మధ్య విభేదాలు సుస్పష్టమని తేల్చేశారు. వచ్చే ఏడాది ఐపీఎల్ లో అతడిని చెన్నై తరఫున చూడటం కష్టమేనని వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా ఇటీవల ధోని బర్త్డే సందర్భంగా చెన్నై ఆటగాళ్లంతా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వీడియోను సీఎస్కే తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రవీంద్ర జడేజా కనిపించకపోవడం విశేషం. సీఎస్కే పోస్ట్ చేసిన వీడియోలో విషెస్ చెప్పకున్నా తన ట్విటర్ ఖాతాలో కూడా జడ్డూ.. ధోనిని విష్ చేయలేదు. ఇది కూడా అభిమానుల అనుమానానికి ఆజ్యం పోసింది.
తాజా పరిణామాల దృష్ట్యా జడ్డూ-సీఎస్కే విభేదాలపై సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ‘ఏదో జరుగుతున్నది.. జడేజా-సీఎస్కేల బంధం ఇక ముగిసినట్టే..’ అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన టెస్టులో జడేజా సెంచరీ చేసిన తర్వాత ఐపీఎల్ గురించి ప్రశ్నించగా.. ‘నేను దాని గురించి పట్టించుకోవట్లే. అదంతా నా మైండ్లో లేదు..’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విభేదాల ఎపిసోడ్పై సీఎస్కే ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.