ప్రపంచంలోని ఏ మూలలో టీ20 క్రికెట్ లీగ్ జరిగినా.. అందులో ప్రధాన ఆకర్షణగా నిలిచే వెస్టిండీస్ ఆటగాళ్లు.. జాతీయ జట్టు తరఫున మాత్రం నిరాశ పరిచారు. ఒకటికి రెండుసార్లు విశ్వ విజేతగా నిలిచిన విండీస్.. ఈ సారి అసలు పోరు షురూ కాకముందే ఇంటిబాట పట్టింది. కరీబియన్ జట్టుకు షాకిచ్చిన ఐర్లాండ్.. టీ20 వరల్డ్ కప్ సూపర్-12కు అర్హత సాధించింది. మరోవైపు జింబాబ్వే తొలిసారి మెగాటోర్నీ సూపర్-12 స్టేజ్కు దూసుకెళ్లింది.
హోబర్ట్: టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశ ప్రారంభానికి ముందే.. భారీ సంచలనం నమోదైంది. రెండు సార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టు.. ఈసారి క్వాలిఫయింగ్ టోర్నీలోనే నిష్క్రమించింది. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో విండీస్ 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. గ్రూప్-‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో మొదట విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (62 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) ఒక్కడే పర్వాలేదనిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 17.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 150 రన్స్ చేసింది. పాల్ స్టిర్లింగ్ (66 నాటౌట్), బాల్బిర్ని (37), టకర్ (45 నాటౌట్) రాణించారు. ఇదే గ్రూప్లో జరిగిన మరో మ్యాచ్లో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ను చిత్తు చేసి సూపర్-12కు చేరింది. మొదట స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేయ గా.. జింబాబ్వే 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 రన్స్ చేసింది. ఎర్విన్ (58), సికందర్ (40) రాణించారు.