DC vs SRH | ఐపీఎల్లో భాగంగా అబుదాబి వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2021లో ప్లే ఆఫ్కు చేరాలంటే సన్రైజర్స్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సన్రైజర్స్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్ల్లో ఓడింది. కేవలం ఒక్క మ్యాచ్లోనే గెలిచింది. కాగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కరోనా కలకలం లేపింది.
సన్రైజర్స్ బౌలర్ నటరాజన్ కరోనా బారిన పడినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం అతనికి ఎలాంటి లక్షణాలూ లేవు. మిగతా టీమ్ సభ్యులకు దూరంగా అతడు ఐసోలేషన్లో ఉంటున్నాడు. అతనితో సన్నిహితంగా ఉన్న మరో ప్లేయర్ విజయ్ శంకర్.. టీమ్ మేనేజర్ విజయ్కుమార్, ఫిజియో శ్యామ్ సుందర్, డాక్టర్ అంజనా వన్నన్, లాజిస్టిక్స్ మేనేజర్ తుషార్ ఖేడ్కర్, నెట్ బౌలర్ పెరియసామి కూడా ఐసోలేషన్లో ఉన్నారు. వీళ్లందరికీ బుధవారం ఉదయం 5 గంటలకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు ఐపీఎల్ ఆ ప్రకటనలో తెలిపింది.