IPL | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మెరుపులు మరవకముందే.. క్రీడాభిమానులకు మండు వేసవిలో వినోదాల విందు పంచేందుకు మరో మెగా లీగ్ సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్గా గుర్తింపు సాధించిన ఐపీఎల్కు శుక్రవారం తెరలేవనుంది. కరోనా మహమ్మారి కారణంగా గత మూడేండ్లుగా ఆంక్షల మధ్య సాగిన ఐపీఎల్.. ఈసారి పాత పద్దతిలో ఇంటా బయటా విధానంలో అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. మెగాలీగ్ ఆరంభానికి ముందు జట్ల బలాబలాలపై ఓ కన్నేస్తే..
అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్కు శుక్రవారం తెరలేవనుంది. మూడేండ్లుగా కొవిడ్-19 కారణంగా కొన్ని వేదికలకే పరిమితమైన ఐపీఎల్.. ఈ సారి పాత పద్దతిలో ప్రేక్షకులను అలరించనుంది. లీగ్లోని మొత్తం 10 జట్లు 14 మ్యాచ్ల చొప్పున ఆడనుండగా.. అందులో ఏడు మ్యాచ్లు హోంగ్రౌండ్లో మిగిలినే ఏడు మ్యాచ్లు ప్రత్యర్థి వేదికలపై జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో విజయవంతమైన జట్లలో ఒకటిగా గుర్తింపు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలువలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల బలాలను పరిశీలిస్తే.. గత సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చెన్నైని ఈ సారి ధోనీ ముందుండి నడిపించాలని చూస్తుంటే.. లీగ్ ఆరంభం నుంచి ఒకే జట్టుకు ఆడుతున్న విరాట్ కోహ్లీ ఈ సారైనా 16 ఏండ్ల కల నెరవేర్చుకోవాలని భావిస్తున్నాడు. ఇక కొత్త సారథి శిఖర్ ధవన్ సారథ్యంలోనైనా తమ జట్టు రాత మారుతుందేమో అని పంజాబ్ కింగ్స్ ఎదురుచూస్తున్నది.
సీజన్తో సంబంధం లేకుండా లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి హాట్ ఫేవరెట్గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్కు సారథి మహేంద్ర సింగ్ ధోనీనే అతిపెద్ద బలం. నిరుడు రవీంద్ర జడేజాకు జట్టు పగ్గాలు అప్పగించినా.. అది పెద్దగా కలిసి రాకపోవడంతో తిరిగి మహీనే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, మొయిన్ అలీ రూపంలో చెన్నైకి ఆల్రౌండర్ల బలం దండిగా ఉంది. మరి ఈ సీజన్తో ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని భావిస్తున్న 41 ఏండ్ల ధోనీ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.
అనుభవజ్ఞులు, యువకుల కలయికతో చెన్నై పేపర్పై పటిష్టంగా కనిపిస్తున్నది. ఈ సీజన్ నుంచి ఐపీఎల్ నిబంధనల్లో అనేక మార్పులు చోటు చేసుకోగా.. ఇంపాక్ట్ ప్లేయర్, టాస్ తర్వాత ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించడం వంటి అంశాలను ధోనీ ఎలా వినియోగించుకుంటాడనేది ఆసక్తికరం.
బ్యాటింగ్లో చెన్నైకి పెద్దగా ఇబ్బందులు లేకున్నా.. పేస్ బౌలర్ల గాయాలు ఆ జట్టును ఆందోళన పరుస్తున్నాయి. గాయం కారణంగా ముఖేశ్ చౌదరీ లీగ్కు దూరం కాగా.. గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేయనున్న దీపక్ చాహర్ పూర్తి స్థాయిలో కోలుకోలేదని సమాచారం.
లీగ్ ఆరంభమైనప్పటి నుంచి ప్రతి సారి ‘ఈ సాలా కప్ నమదే’ అంటూ హోరెత్తించే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఈసారైనా కప్ చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్నది. ఐపీఎల్ మొదటి నుంచి ఒకే జట్టుకు ఆడుతున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన విరాట్ కోహ్లీ.. ప్రదర్శనపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కెప్టెన్ డుప్లెసిస్తో పాటు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మ్యాక్స్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
బ్యాటింగ్లో డుప్లెసిస్, కోహ్లీ, రజత్ పాటిదార్, మ్యాక్స్వెల్, డేవిడ్ విల్లేతో పాటు ఫినిషర్ దినేశ్ కార్తీక్పై జట్టు యాజమాన్యం కోటి ఆశలు పెట్టుకుంది. బౌలింగ్లో జోష్ హాజిల్వుడ్, సిరాజ్ పేస్ భారాన్ని మోయనుండగా.. స్పిన్ విభాగంలో శ్రీలంక ఆటగాడు వణిందు హసరంగ కీలకం కానున్నాడు.
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు నాణ్యమైన ఆటగాళ్లు, నైపుణ్యంగల సహయ బృందం ఉన్నా.. బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలువలేకపోయింది. మరి ఏండ్లుగా ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ కల నెరవేరాలంటే ఆటగాళ్లంతా సమిష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది.
నిరుడు మయాంక్ అగర్వాల్కు జట్టు పగ్గాలు అప్పగించిన పంజాబ్ కింగ్స్ ఈ సారి సారథితో పాటు కోచింగ్ సిబ్బందిని మార్చింది. భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్కు నాయకత్వ బాధ్యతలు ఇచ్చిన పంజాబ్.. 2019లో ఇంగ్లండ్కు తొలిసారి వన్డే ప్రపంచకప్ అందించిన ట్రేవర్ బేలీస్ వంటి కోచ్ను పట్టుకొచ్చింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్పై పంజాబ్ భారీ ఆశలు పెట్టుకుంది.
ధవన్తో పాటు బెయిర్స్టో, లియామ్ లివింగ్స్టోన్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, సామ్ కరన్, షార్ట్, షారుక్ ఖాన్తో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడతో పాటు అర్ష్దీప్ సింగ్ పేస్ భారం మోయనుండగా.. రాహుల్ చాహర్, హర్ప్రీత్ బ్రార్ స్పీన్ బాధ్యతలు చూసుకోనున్నారు.
జట్టు నిండా హిట్టర్లే కనిపిస్తున్నా.. వీళ్లంతా సమిష్టిగా సత్తాచాటుతారా అనేదే అతిపెద్ద సమస్య! బెయిర్ స్టో భీకర బ్యాటర్ అయినప్పటికీ నిలకడ సమస్య వెంటాడుతోంది. స్పిన్లో రాహుల్ చాహర్ మినహా పెద్దగా ప్రత్యామ్నాయాలు లేకపోవడం కూడా ఇబ్బందే.