బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఐపీఎల్ వేలం కొనసాగుతున్నది. రెండోరోజు వేలంలో ఇంగ్లండ్కు చెందిన ఆల్ రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ హెడ్లైన్స్లో నిలిచాడు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ లివింగ్ స్టోన్ను భారీ ధరకు కొనుగోలు చేసింది. అతని కోసం పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఏకంగా రూ.11.50 కోట్లను వెచ్చింది. లివింగ్స్టోన్ బేసిక్ ప్రైజ్ కోటి రూపాయలు.
కాగా, పొట్టి క్రికెట్లో ప్రతి బంతిని బలంగా బాదగలిగిన అతి కొద్దిమంది ఆటగాళ్లలో లివింగ్ స్టోన్ ఒకడు. అతను బంతితోనేగాక బ్యాట్తోనూ ఆటను మలుపు తిప్పగలడు. బంతితో సమర్థంగా ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. అందుకే ఈసారి ఐపీఎల్ వేలంలో అతనికి భారీ డిమాండ్ ఏర్పడింది. శనివారం మొదలైన వేలం ఇవాళ్టితో ముగియనున్నది.
ఇవాళ వేలం ప్రారంభమవగానే అజింక్య రహానేను అతని బేస్ ప్రైజ్ అయిన కోటి రూపాయలకు కోల్కతా నైట్ రౌడర్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయితే వేలం రెండోరోజు కూడా కొనుగోలుకానీ ఆటగాళ్ల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఇవాళ్టి వేలంలో ఇయాన్ మోర్గాన్, అరోన్ ఫించ్, ఛటేశ్వర్ పుజారాలను ఎవరూ కొనుగోలు చేయలేదు.
లివింగ్ స్టోన్ కోసం జరిగిన బిడ్డింగ్లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో కోల్కతా నైట్రైడర్స్ పోటీపడింది. మధ్యలో సన్రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీకి వచ్చి ఆ తర్వాత తప్పుకుంది.