IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈ ఏడాది జరగాల్సి ఉన్న సీజన్ మార్చి 22 నుంచి మొదలుకానుందని, ఈ టోర్నీని భారత్తో పాటు మరో దేశంలో జరిపించే అవకాశమున్నట్టు గత కొన్ని రోజులు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భారత్లో సరిగ్గా ఐపీఎల్ జరిగే సమయానికే లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఈ టోర్నీని తొలి అంచె ఇక్కడ నిర్వహించి రెండో అంచె పోటీలను విదేశాల్లో నిర్వహిస్తారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించాడు. ఈ ఏడాది ఐపీఎల్ భారత్ లోనే జరుగుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ధుమాల్ స్పష్టం చేశాడు.
ఐఎఎన్ఎస్తో దుమాల్ మాట్లాడుతూ.. ‘మేం భారత ప్రభుత్వం, ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నాం. ఈ లీగ్ కచ్చితంగా భారత్లోనే జరుగుతుంది. మేం జనరల్ ఎలక్షన్స్ షెడ్యూల్ గురించి వేచి చూస్తున్నాం. దాని ప్రకారం ఐపీఎల్ షెడ్యూల్ నిర్వహణపై మాకు క్లారిటీ వస్తుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఉండే మ్యాచ్ల నిర్వహణపై మేం ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఉంటుంది..’ అని అన్నాడు.
ఇక ఐపీఎల్ మార్చి 22 నుంచి మొదలుకానుందని వస్తున్న వార్తలపైనా ధుమాల్ స్పందించాడు. ‘అందుకు సంబంధించి మేం ఇంకా అధికారికంగా తేదీ ఏదీ నిర్ణయించలేదు. బహుశా మార్చి మాసాంతంలో ఈ సీజన్ మొదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి..’ అని చెప్పాడు.
ఈ ఏడాది సాధారణ ఎన్నికల కారణంగా ఐపీఎల్ షెడ్యూల్కు సంబంధించి బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. పది ఫ్రాంచైజీలు ఉన్న ఐపీఎల్లో.. హోం అండ్ అవే పద్ధతిలో మ్యాచ్లు జరుగుతాయన్న విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికలు పలు దఫాలుగా జరిగే అవకాశం ఉండటంతో ఏ ఏ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగాయనే దానిని బట్టి ఆ సమయంలో సంబంధిత ప్రాంతాల్లో మ్యాచ్ల నిర్వహణ లేకుండా చూసేందుకు బీసీసీఐ యత్నిస్తోంది. స్థానికంగా ఉండే పోలీస్ యంత్రాంగంతో పాటు భద్రతా దళాలన్నీ ఎన్నికల బిజీలో ఉండే తరుణంలో ఐపీఎల్ టీమ్స్కు భద్రత కల్పించడం శక్తికి మించిన పనే. బీసీసీఐ ప్రధానంగా ఇదే సమస్యతో షెడ్యూల్పై సతమతమవుతోంది. అయితే త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని బీసీసీఐ భావిస్తోంది.