IPL | సరిగ్గా 16 ఏండ్ల క్రితం పురుడు పోసుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ గతిని మార్చింది. అప్పటి వరకు ఒక లెక్క..అప్పటి నుంచి మరో లెక్క అన్న తీరుగా క్రికెట్కు కొత్త నిర్వచనమైంది. సీజన్ సీజన్కు నయా హంగులతో ఈ లీగ్ అభిమానులను అలరిస్తున్నది. మండు వేసవిలో సాయంకాలం పూట సరదాగా ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గర కూడి వీక్షించే సమయం ఆసన్నమైంది. చిన్నా, పెద్ద అన్న వయో బేధం లేకుండా క్రికెట్ మజాను ఆస్వాదించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. మరింకెందుకు ఆలస్యం మరికొన్ని గంటల్లో ఫోర్లు, సిక్సర్ల జడివానతో మొదలయ్యే ఐపీఎల్ ధూం ధాం ధమాకాలో మనం తడిసి ముద్దవుదాం పదండి!!
గత సీజన్లకు భిన్నంగా ఈసారి అభిమానులను ఆటతో పాటు స్టార్ ప్లేయర్ల భావోద్వేగాలు కట్టిపడేయనున్నాయి. మిన్ను విరిగి మీదపడ్డా తన పని తాను చేసుకుపోయే ధోనీ మరోమారు ఫ్యాన్స్కు షాకిచ్చాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ రుతురాజ్కు చెన్నై పగ్గాలు అప్పజెప్పాడు. తన కెప్టెన్సీ చరిష్మాతో ఏకంగా ఐదు సార్లు చెన్నైను ఐపీఎల్ విజేతగా నిలిపిన ధోనీ కెరీర్ ఆఖర్లో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి. ఇక 16 ఏండ్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం చకోరా పక్షిలా వేచిచూస్తున్న విరాట్ కోహ్లీ ఈసారైనా ఆర్సీబీని విజేతగా చూడాలని పట్టుదలతో ఉన్నాడు. ఓవైపు ఆర్సీబీ అమ్మాయిలు టైటిల్ గెలువగా, ఇప్పుడు అబ్బాయిల వంతు వచ్చింది. మరీ ‘ఈ సాలా కప్ నమ్దే’ అన్న ఆర్సీబీ స్లోగన్ 17వ సీజన్లోనైనా ఫలిస్తుందా అన్నది కాలమే నిర్ణయించనుంది.
న్యూఢిల్లీ: ఐపీఎల్ హంగామాకు అంతా సిద్ధమైంది. మండు వేసవి వేళ అభిమానులకు క్రికెట్ మజాను అందించేందుకు లీగ్ అన్ని హంగులతో ముస్తాబైంది. వివిధ దేశాల క్రికెటర్ల మేళవింపుతో కూడిన పది జట్లు టైటిల్ కోసం నువ్వానేనా అన్నట్లు పోటీపడనున్నాయి. ఇన్ని రోజుల ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు ఇప్పుడు ప్రత్యర్థులుగా కయ్యానికి కాలు దువ్వనున్నారు. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య శుక్రవారం జరుగనున్న పోరుతో ఐపీఎల్-17వ సీజన్కు అట్టహాసంగా తెరలేవనుంది. దక్షిణాది జట్ల మధ్య పోరు అభిమానులను ఫుల్ టికెట్ మజాను అందించనుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న చెన్నై… రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్ను ఒడిసిపట్టుకోవాలని చూస్తుంటే..ఈ సారైనా కప్ను కైవసం చేసుకోవాలన్న కసితో ఆర్సీబీ కనిపిస్తున్నది. మరి ఇరు జట్ల మధ్య పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
ఐపీఎల్లో అప్రతిహత విజయాలతో ఇప్పటికే ఐదుసార్లు టైటిల్ దక్కించుకున్న చెన్నై సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్ రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్పై కన్నేశాయి. లీగ్లో మిగతా జట్లతో పోలిస్తే అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తున్న ముంబై, చెన్నై నిలకడకు పెట్టింది పేరు. అయితే ఐదుసార్లు లీగ్ విజేతగా నిలిపిన ధోనీ, రోహిత్శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఒక రకంగా ప్రతికూలమైనా.. ఆ ఘన వారసత్వాన్ని రుతురాజ్, హార్దిక్ ఎలా కొనసాగిస్తారనేదే ఆసక్తికరం.
కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) తీన్మార్ కొట్టేందుకు తహతహలాడుతున్నది. రెండుసార్లు టైటిల్ గెలిచిన కోల్కతా ముచ్చటగా మూడోసారి కప్ను సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నది. రెండు సార్లు లీగ్ విజేతగా నిలిపిన గంభీర్ మెంటార్గా రావడం కోల్కతాకు వెయ్యి ఏనుగుల బలం. వేలంలో రికార్డు ధరకు దక్కించుకున్న మిచెల్ స్టార్క్ ఏ మేరకు మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.
ఐపీఎల్ ట్రోఫీని ఒక్కసారైనా నెగ్గాలని బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్, లక్నో కండ్లల్లో వత్తులు వేసుకుని చూస్తున్నాయి. లీగ్ మొదలయ్యి 16 ఏండ్లుగా గడిచినా..ఈ జట్లకు టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది.
హైదరాబాద్, గుజరాత్ డబుల్ ధమాకా కోసం చూస్తున్నాయి. బలాబలాల పరంగా మిగతా జట్లకు ఏమాత్రం తీసిపోని ఈ మాజీ చాంపియన్లు మరోమారు జూలు విదిల్చాలని చూస్తున్నాయి.