IPL 2024 | ఐపీఎల్ -17 సీజన్ ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్కు గుడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ తిరిగి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. గతేడాది ముగిసిన వన్డే వరల్డ్ కప్లో భాగంగా గాయపడ్డ రషీద్ ఆ తర్వాత వెన్ను నొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో భారత్తో జరిగిన టీ20 మ్యాచ్ సిరీస్లో సభ్యుడిగా ఉన్నా అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తాజాగా ఐర్లాండ్తో జరుగుతున్న టెస్టు, వన్డేలలో కూడా అతడు భాగస్వామి కాలేదు. కానీ శుక్రవారం ఐర్లాండ్తో మొదలుకాబోతున్న టీ20 సిరీస్కు అతడు కెప్టెన్గా రీఎంట్రీ ఇచ్చాడు.
ఈ మేరకు రషీద్ ఖాన్.. ఇన్స్టాగ్రామ్ వేదికగా నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ‘నాకు అత్యంత సంతోషాన్నిచ్చేది క్రికెట్ ఫీల్డ్లోకి దిగినప్పుడే. నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచినందరికీ కృతజ్ఞతలు..’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియో ద్వారా రషీద్ తాను పూర్తిగా కోలుకున్నట్టు చెప్పకనే చెప్పాడు. ఇది గుజరాత్ టైటాన్స్ అభిమానులకు సంతోషాన్నిచ్చేదే..
గత రెండు సీజన్లలో రషీద్ ఖాన్.. గుజరాత్ కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. బౌలర్గానే గాక బ్యాటర్గా కూడా అతడు గుజరాత్ టీమ్లో నమ్మదగ్గ ప్లేయర్. హార్ధిక్ పాండ్యా ఫ్రాంచైజీని వదిలిన నేపథ్యంలో ఆ జట్టు కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో ఈ సీజన్ ఆడనున్నది. గత రెండు సీజన్లలో ఫైనల్ చేరి ఓసారి విజేతగా నిలిచిన గుజరాత్.. కొత్త సారథి హయాంలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి..