IPL 2024 :ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో ఉత్కంఠ రేపుతున్న మ్యాచ్లు అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పటికీ జరిగిన మూడు మ్యాచుల్లో ఆఖరి ఓవర్ థ్రిల్లర్లు ఫ్యాన్స్ను మునివేళ్లపై నిలబెట్టాయి. సీజన్ తొలి విడుత షెడ్యూల్లో భాగంగా 21 మ్యాచ్లు ఏప్రిల్ 7న ముగియనున్నాయి. ఈ సమయంలో టాటా ఐపీఎల్ ఫైనల్ తేదీ వెలువడింది. మే 26వ తేదీన మెగా టోర్నీ టైటిల్ పోరు నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోందట.
పదిహేడో సీజన్ ఆరంభ పోరుకు వేదికైన చిదంబరం స్టేడియం(Chidambaram Stadium)లోనే ఫైనల్ ఫైట్ నిర్వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే చెపాక్ మైదానంలోనే విజేతకు ట్రోఫీని బహూకరించనున్నారు. అంతేకాదు క్వాలిఫయర్ 2మ్యాచ్కు కూడా చెపాక్ వేదిక కానుందని సమాచారం. అయితే.. ఫైనల్ స్టేడియంపై బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది.
ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి బహుశా ఇదే చివరి సీజన్ కావొచ్చు. దాంతో, అతడికి ఘనమైన వీడ్కోలు పలకాలని చెన్నై సూపర్ కింగ్స్తో పాటు బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యం భావిస్తోంది. అందుకనే ఐపీఎల్ ఫైనల్ను చిందంబరం స్టేడియంలో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధపడి ఉండవచ్చు. ఒకవేళ సీఎస్కే ఫైనల్ చేరితే సొంత మైదానమైన చెపాక్లో ధోనీకి అరుదైన గౌరవం దక్కినట్టే. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై 17వ సీజన్ ఆరంభ పోరులో ఆర్సీబీపై గెలుపొందింన విషయం తెలిసిందే.