ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గువాహటిలోని బర్సాపర స్టేడియంలో బుధవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. చివరి బంతిదాకా ఉత్కంఠభరితంగా కొనసాగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ పోరాడి ఓడింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులే చేసింది.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడారు. ఒకరిని మించి మరొకరు దొరికిన బంతిని దొరికినట్టుగా బాదారు. ట్రెంట్ బౌల్ట్, అశ్విన్, చహల్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను క్లబ్ స్థాయి బౌలర్లుగా మారుస్తూ వీరబాదుడు బాదారు. పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 60 (34 బంతుల్లో, 3 సిక్స్లు, 7 ఫోర్లు) సిక్సర్లు, ఫోర్లు దంచి కొట్టాడు. మరో ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్ (56 బంతుల్లో 86 నాటౌట్, 9 ఫోర్లు,3 సిక్సర్లు), నాలుగో స్థానంలో వచ్చిన జితేశ్ శర్మ (16 బంతుల్లో 27, 2 ఫోర్లు, 1 సిక్స్) లు ధాటిగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్.. 4 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు. పంజాబ్ బ్యాట్స్మెన్లో శిఖర్ ధావన్ (86 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యజువేంద్ర చాహల్, కేఎం ఆసిఫ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆసిఫ్ నాలుగు ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకోగా, చాహల్ 50 పరుగులు ఇచ్చాడు. జాసన్ హోల్డర్ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. మరో బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 38 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆ తరువాత 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్కు ఆశించిన ఆరంభం లభించలేదు. రవిచంద్రన్ అశ్విన్ను (0) ఓపెనర్గా పంపినా ప్రయోగం ఫలించలేదు. అశ్విన్ నాలుగు బంతులు ఆడి ఖాతా తెరవకుండా అవుటయ్యాడు. యశస్వి జైస్వాల్ (11, 8 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), జోస్ బట్లర్ (11 బంతుల్లో 19, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా విఫలం అయ్యారు. దీంతో రాజస్తాన్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన సంజు శామ్సన్ ( 25 బంతుల్లో 42, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), దేవ్దత్ పడిక్కల్ ( 26 బంతుల్లో 21, ఒక ఫోర్) ఇన్నింగ్స్ను కుదుటపరిచారు. సంజు వేగంగానే ఆడినా దేవ్దత్ పడిక్కల్ మరీ నిదానంగా ఆడటంతో చేయాల్సిన రన్రేట్ పెరిగిపోయింది. వీళ్లిద్దరూ నాలుగో వికెట్కు 34 పరుగులు జోడించారు. 91 పరుగుల వద్ద సంజు శామ్సన్ అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే రియాన్ పరాగ్ (12 బంతుల్లో 20, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), దేవ్దత్ పడిక్కల్ కూడా అవుటయ్యారు. దీంతో 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి రాజస్తాన్ ఓటమి అంచున నిలిచింది.
ఈ దశలో షిమ్రన్ హెట్మేయర్ (18 బంతుల్లో 36, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), కొత్త కుర్రాడు ధ్రువ్ జోరెల్ (15 బంతుల్లో 32 నాటౌట్, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) భారీ షాట్లు కొడుతూ ఇన్నింగ్స్ను పరిగెత్తించారు. వీరు కేవలం 27 బంతుల్లోనే 62 పరుగులు జోడించారు. అయితే చివరి ఓవర్లో షిమ్రన్ హెట్మేయర్ అవుట్ కావడంతో మ్యాచ్ రాజస్తాన్ చేతికి వచ్చింది. హెట్మేయర్ స్థానంలో వచ్చిన హోల్డర్ (1 నాటౌట్) క్రీజులోకి వచ్చీరాగానే భారీ షాట్లు ఆడలేకపోయాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులకు పరిమితం అయింది.