ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. ఈ ఏడాది మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఇండియాలోనే ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. అయితే మొత్తం నాలుగు వేదికల్లో మ్యాచ్లను నిర్వహించనున్నారు. వాంఖడే స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, డీవై పాటిల్ స్టేడియం, ఎంసీఏ స్టేడియాల్లో మ్యాచ్లను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ వర్చుల్ భేటీ నిర్వహించింది. ఒకవేళ కోవిడ్ వల్ల ఇండియాలో టోర్నీ చేపట్టలేని పక్షంలో అప్పుడు యూఏఈకి వేదికలను మార్చే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ అభిప్రాయపడింది. ముంబై, పూణెల్లో మ్యాచ్లను నిర్వహించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణం అవసరం ఉండదని, బయోబబుల్ సమస్య రాదన్న ఉద్దేశంలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్ కోసం ఆటగాళ్ల వేలాన్ని ఫిబ్రవరి 12, 13 తేదీల్లో యధావిధిగా కొనసాగించనున్నారు.