ఇటు బౌలింగ్ బలం.. అటు బ్యాటింగ్ దళం!ఇక్కడ వాయువేగంతో బంతులేసే బౌలర్..అక్కడ ఫుల్ ఫామ్లో ఉన్న ఫినిషర్!జట్టును ముందుండి నడిపిస్తున్న నాయకుడు ఇటువైపు..టాపార్డర్ అండతో ముందుకు సాగుతున్న టీమ్ మరోవైపు!
ఐపీఎల్-15వ సీజన్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ శనివారం రెండో పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది!
ముంబై: వరుస విజయాలతో జోరు మీదున్న సన్రైజర్స్ హైదరాబాద్.. బెంగళూరుతో అమీతుమీకి రెడీ అయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్మ్,్ర నికోలస్ పూరన్ మంచి టచ్లో ఉండటం హైదరాబాద్కు కలిసొచ్చే అంశం కాగా.. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ నిలకడకు ఉమ్రాన్ మాలిక్ వేగం తోడవడంతో రైజర్స్ వరుసగా నాలుగు విజయాలు సాధించింది. ఆడిన ఆరు మ్యాచ్ల్లో 8 పాయింట్లతో మంచి జోష్లో ఉన్న విలియమ్సన్ సేన.. ఈ సీజన్లో అసాధారణ ప్రదర్శన చేస్తున్న బెంగళూరుకు సవాల్ విసరాలని చూస్తున్నది. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, అనూజ్ రావత్, మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్తో పటిష్టంగా ఉన్న బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ను రైజర్స్ బౌలర్లు ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరం!
కండ్లన్నీ అతనిపైనే..
తాజా సీజన్లో తన సహజసిద్ధ బౌలింగ్ శైలితో ఉమ్రాన్ మాలిక్ క్రీడాలోకాన్ని కట్టిపడేస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో కేవలం వేగం మీదే దృష్టి పెట్టి ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ఈ కశ్మీర్ ఎక్స్ప్రెస్.. ప్రస్తుతం లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్తో కలిసి ఉమ్రాన్ మరింత రాటుదేలాడు. వీరికి మార్కో జాన్సెన్ తోడవడంతో హైదరాబాద్ బౌలింగ్ దళం ప్రత్యర్థులను కలవరపెడుతున్నది. బ్యాటింగ్లో తలా కొన్ని పరుగులే చేసినా.. రైజర్స్ వరుసగా నాలుగు మ్యాచ్లు నెగ్గిందంటే అందుకు ప్రధాన కారణం బౌలింగే.
మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్తో తంటాలు పడుతున్నా.. డుప్లెసిస్, కార్తీక్ ఊపు మీదున్నారు. ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరుసార్లు నాటౌట్గా నిలిచిన కార్తీక్.. ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నాడు. ఐపీఎల్-15లో కార్తీక్ 32 నాటౌట్, 14 నాటౌట్, 7 నాటౌట్, 34, 66 నాటౌట్, 13 నాటౌట్తో సత్తాచాటాడు. జోష్ హజిల్వుడ్ రాకతో బెంగళూరు బౌలింగ్ దళం కూడా బలంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తున్నది!
తుది జట్లు (అంచనా)
హైదరాబాద్: విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్, త్రిపాఠి, మార్క్మ్,్ర పూరన్, శశాంక్, సుచిత్, భువనేశ్వర్, నటరాజన్, జాన్సెన్, ఉమ్రాన్.
బెంగళూరు: డుప్లెసిస్ (కెప్టెన్), అనూజ్, కోహ్లీ, మ్యాక్స్వెల్, ప్రభుదేశాయ్, షాబాజ్, కార్తీక్, హర్షల్, హసరంగ, హజిల్వుడ్, సిరాజ్.