ప్లే ఆఫ్స్ చేరిన రాయల్స్
ఆఖరి పోరులో చెన్నై ఓటమి అశ్విన్ ఆల్రౌండ్ షో మోయిన్ మెరుపులు వృథా
కీలక పోరులో చెన్నైపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన రాజస్థాన్ రాయల్స్.. నాలుగేండ్ల తర్వాత ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండ్ షో కనబర్చడంతో.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో రాయల్స్ లీగ్ దశను ముగించింది. 14 మ్యాచ్ల్లో నాలుగింట మాత్రమే నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సీజన్ను నిరాశతో ముగించగా.. మంగళవారం జరుగనున్న తొలి క్వాలిఫయర్లో గుజరాత్ టైటాన్స్తో తలపడేందుకు రాజస్థాన్ సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో పరాజయం పాలైనా.. ఫైనల్ చేరేందుకు ఇరు జట్లకు మరో అవకాశం ఉండటం వారికి కలిసి రానుంది!
ముంబై: అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్-15వ సీజన్లో రెండో స్థానంతో లీగ్ దశను ముగించింది. శుక్రవారం జరిగిన పోరులో రాజస్థాన్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తుచేసింది. 14 మ్యాచ్ల్లో తొమ్మిందిట నెగ్గిన రాయల్స్ 18 పాయింట్లతో లక్నోతో సమంగా నిలిచినా.. మెరుగైన రన్రేట్ కారణంగా రెండో స్థానానికి దూసుకెళ్లింది. లీగ్ దశలో కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై తొమ్మిదో స్థానంతో సీజన్ను ముగించింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మోయిన్ అలీ (57 బంతుల్లో 93; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) యాంకర్ రోల్ పోషించగా.. సహచరుల నుంచి అతడికి సరైన సహకారం లభించలేదు. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (26), కాన్వే (16) మెరుగైన ఆరంభాలను భారీ ఇన్నింగ్స్లుగా మలచలేకపోయారు. రాయల్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, మెక్కాయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (44 బంతుల్లో 59; 8 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుగైన ఆరంభం అందించగా.. రవిచంద్రన్ అశ్విన్ (23 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒత్తిడిని అధిగమిస్తూ చక్కటి ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. చెన్నై బౌలర్లలో ప్రశాంత్ రెండు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
అదరగొట్టిన అలీ
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (2) ఔట్ కాగా.. రెండు ఓవర్లు ముగిసే సరికి చెన్నై మూడు పరుగులే చేయగలిగింది. మూడో ఓవర్లో కాన్వే 6,4తో మోత మొదలుపెట్టగా.. మోయిన్ అలీ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో 4,4,6,4 దంచిన అలీ.. ఐదో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ అరుసుకున్నాడు. ఇక బౌల్ట్ వేసిన ఆరో ఓవర్లో అలీ అరాచకం సృష్టించాడు. తొలి బౌంతికి సిక్సర్ బాదిన ఇంగ్లిష్ ఆల్రౌండర్.. తర్వాతి ఐదు బంతులను బౌండ్రీ దాటించాడు. ఫలితంగా ఒక్క ఓవర్లోనే 26 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి చెన్నై వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది.
ఈ క్రమంలో మోయిన్ అలీ 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అలీ సాధించిన తొలి 59 పరుగుల్లో 58 బౌండ్రీల ద్వారానే రావడం విశేషం. ఈ ఊపు చూస్తుంటే.. చెన్నై భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించగా.. రాయల్స్ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని ధోనీ సేన జోరుకు బ్రేకులు వేశారు. కాన్వేను అశ్విన్ ఔట్ చేయగా.. నారాయణ్ జగదీశన్ (1) అతడిని అనుసరించాడు. అంబటి రాయుడు (3) ప్రభావం చూపలేకపోగా.. ధోనీ క్రీజులో ఉన్నా భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆఖర్లో మహీతో పాటు అలీ ఔట్ కావడంతో చెన్నై అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. తొలి 6 ఓవర్లలో 75 పరుగులు పిండుకున్న ధోనీ సేన.. తక్కిన 14 ఓవర్లలో 75 పరుగులే చేయగలిగింది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 150/6 (మోయిన్ అలీ 93, ధోనీ 26; మెక్కాయ్ 2/20, చాహల్ 2/26), రాజస్థాన్: 19.4 ఓవర్లలో 151/5 (యశస్వి 59, అశ్విన్ 40 నాటౌట్; ప్రశాంత్ 2/20).