ముంబై : ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో అధికారికంగా జట్టు పేరును ప్రకటించింది. ‘లక్నో సూపర్ జెయింట్స్’ (Lucknow Super Giants) పేరు ఖరారు చేసినట్లు సోమవారం తెలిపింది. ఆర్పీఎస్జీ వెంచర్చ్ లిమిటెడ్ (గొయెంకా గ్రూప్) చైర్మన్, లక్నో ఫ్రాంచైజీ యజమాని డాక్టర్ సంజీవ్ గొయెంక వీడియో సందేశం ద్వారా పేరు ప్రకటించారు. ఇంతకు ముందు గొయెంకా గ్రూప్ 2016లో పూణే ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఆ సమయంలో జట్టుకు ‘రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్’ పేరు పెట్టింది. రెండేళ్ల తర్వాత 2018లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తిరిగి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూణే జట్టు ఐపీఎల్ నుంచి వైదొలిగింది.
లక్నో ఫ్రాంచైజీకి పేరు పెట్టేందుకు సోషల్ మీడియాలో గొయెంకా గ్రూప్ పోటీని నిర్వహించింది. ‘నామ్ బనావో.. ఔర్ నామ్ కామావో’ పేరిట పోటీ చేపట్టింది. లక్షలాది మంది వివిధ పేర్లు సూచించగా.. చివరకు జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేశామని, ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని సంజీవ్ గొయెంకా తెలిపారు. జట్టుకు ఇలాగే ప్రేమను అందించాలని కోరారు. ఈ ఏడాది ఐపీఎల్ ఎనిమిది జట్లకు బదులగా ఈ సారి పది జట్లు పాల్గొననున్నాయి. గత ఏడాది అక్టోబర్ 25న ఐపీఎల్ కోసం బీసీసీఐ రెండు కొత్త జట్లను ప్రకటించింది. లక్నోను ఆర్పీఎస్జీ వెంచర్స్ లిమిటెడ్ రూ.7090కోట్లకు, అహ్మదాబాద్ జట్టును రూ.5626కోట్లకు సీవీసీ క్యాపిటల్ దక్కించుకుంది. అయితే, అహ్మదాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇంకా టీమ్ పేరును ప్రకటించలేదు.
ఈ ఏడాది జరిగే ఐపీఎల్ కోసం లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు తమ ముగ్గురు ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. లక్నో ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్ను కెప్టెన్గా తీసుకోగా.. అతని కోసం రూ.17కోట్లు వెచ్చించింది. లక్నో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్, భారత అన్క్యాప్డ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్లతో ఒప్పందం చేసుకున్నది. అదే సమయంలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తన ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. ఆల్రౌండర్ హర్దిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనుండగా.. ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ఖాన్, భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ను కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. ఈ సీజన్కు సంబంధించి మెగా వేలం వచ్చే నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగనున్నది.