ముంబై: అనారోగ్యం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా మరో రెండు లీగ్ మ్యాచ్లకు దూరమయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అతడికి దవాఖానలో పరీక్షలు చేయించగా టైఫాయిడ్ సోకిందని తెలిసింది. దీంతో మిగతా మ్యాచ్లకు అతడిని దూరం పెట్టారు. ‘పృథ్వీషా కొన్ని వారాలుగా జ్వరంతో బాధపడుతున్నాడు అంతే. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు’ అని సహాయ కోచ్ షేన్ వాట్సన్ తెలిపాడు. ఇటీవల ఢిల్లీ జట్టులో ఓ నెట్ బౌలర్కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణవగా.. బృందంలోని సభ్యులందరికీ వైద్య పరీక్షలు చేశారు.
అయితే అప్పటికే జ్వరంతో బాధపడుతున్న షాను పరీక్షించగా నెగిటివ్ అని తేలింది. ముందస్తు జాగ్రత్తగా పృథ్వీషాను దవాఖానలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బుధవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ రిషబ్ పంత్ ‘పృథ్వీషాకు టైఫాయిడ్ సోకింది’ అని తెలిపాడు. ఐపీఎల్ తాజా సీజన్లో ఢిల్లీ 12 మ్యాచ్లాడి 6 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతున్నది.