ఉత్కంఠ భరితంగా సాగిన క్రికెట్ పండుగ ఐపీఎల్ ముగిసింది. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కప్పు ఎగరేసుకెళ్లింది. ఈ వేడుకల ముగింపులో భాగంగా.. ఐపీఎల్ మ్యాచుల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గ్రౌండ్ స్టాఫ్కు బీసీసీఐ నుంచి నగదు బహుమతి లభించింది. ఈ ఏడాది కరోనా భయంతో ఐపీఎల్ మ్యాచులను కేవలం ఆరు మైదానాలకే పరిమితం చేశారు.
వాటిలో కూడా ముంబై, పూణేలోని నాలుగు మైదానాల్లోనే లీగ్ దశలోని 70 మ్యాచులు నిర్వహించారు. ప్లేఆఫ్స్ కోసం మాత్రం ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోదీ స్టేడియాలు ఉపయోగించారు. ఈ నేపథ్యంలోనే ఈ మైదానాల గ్రౌండ్స్మెన్కు రూ.1.25 కోట్ల బహుమతి అందిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా ట్వీట్ చేశారు. సీసీఐ, వాంఖడే, డీవై పాటిల్, ఎంసీఏ, పూణే మైదానాలకు ఒక్కోదానికి రూ.25 లక్షల చొప్పున బహుమతి ఇస్తున్నట్లు షా వెల్లడించారు. అలాగే ప్లేఆఫ్స్ నిర్వహించిన ఈడెన్ గార్డెన్స్, నరేంద్ర మోదీ స్టేడియం నిర్వాహకులకు చెరో రూ.12.5 లక్షల చొప్పున నజరానా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘‘టాటా ఐపీఎల్ 2022లో ఉత్కంఠ భరితమైన మ్యాచులు అందించిన వాళ్లకు రూ.1.25 కోట్ల బహుమతి ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ది అన్ సంగ్ హీరోస్.. ఈ ఐపీఎల్ సీజన్లో మ్యాచులు నిర్వహించిన ఆరు మైదానాల్లోని మన క్యురేటర్లు, గ్రౌండ్స్మెన్కు ఈ బహుమతి అందిస్తున్నాం’’ అని షా ట్వీట్ చేశారు.
I'm pleased to announce a prize money of INR 1.25 crores for the men who gave us the best games in #TATAIPL 2022. The unsung heroes – our curators and groundsmen across 6 IPL venues this season.
— Jay Shah (@JayShah) May 30, 2022