ఆదిలాబాద్ రూరల్, మార్చి 19 : రాష్ట్రంలోని పేద ప్రజల కోసమే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి, అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని న్యూ రాంపూర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కొట్నాక్ జంగు, బీజేపీ నుంచి 30 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. కాగా, ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. రైతుల ముఖాల్లో ఆనందం కోసం రైతు బంధు, పంటలకు గిట్టుబాటు ధర, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నారని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యేకు గ్రామస్తులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఆత్మ డివిజన్ చైర్మన్ జిట్టా రమేశ్, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, సర్పంచ్ డీ కవిత, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ సోనేరావ్, పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్, నాయకులు వెంకటి, భూమారెడ్డి, అనంద్రావ్, ఆశారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాత్కాలికంగా దివ్యాంగుల సంఘ భవనం ప్రారంభం..
ఎదులాపురం, మార్చి 19 : స్థానిక కైలాస్నగర్లో గల ప్ర భుత్వ భవనంలోని సీ క్వార్టర్స్లో తాత్కాలిక దివ్యాంగుల సం ఘ భవనాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే సీఎం కేసీఆర్, మంత్రితో మాట్లాడి దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ జీవో నంబర్ 4 ప్రకారం రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా అవుట్సోర్సింగ్లో రిజర్వేషన్ అమలయ్యేలా చూస్తానని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దివ్యాంగుల కాలనీ ఏర్పాటు చేయడంతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషిచేస్తామన్నారు. ఏదైనా నైపుణ్యం గల కోర్సులు ఎంపిక చేసుకుంటే ఉచితంగా శిక్షణ ఇస్తామని చెప్పారు. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ అధికారి మిల్కా మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు హయాంలో ప్రభుత్వ రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగులకు వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. అనంతరం అక్కడే మొక్క నాటి నీరు పోశారు. సంఘం నాయకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, మున్సిపల్ ఫ్లోర్లీడర్ బండారి సతీశ్, నాయకులు డీ రాజు, నారాయణ, దివ్యాంగుల సంఘం నాయకులు సునీల్, ఇమ్రాన్ పాల్గొన్నారు.
ప్రతి గింజా కొనుగోలు చేస్తాం..
జైనథ్, మార్చి 19 : రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్ మార్కెట్ యార్డులో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసేందుకు రూ.578 కోట్లు కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాల వల్ల ఈ ఏడాది కొనుగోళ్లు కొంత ఆలస్యమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్రెడ్డి, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, ఏడీఏ పుల్లయ్య, నాయకులు పురుషోత్తం యాదవ్, చంద్రయ్య, గంభీర్ఠాక్రే, సతీశ్పవార్, రైతులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..
జైనథ్ మండలానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ఎమ్మె ల్యే రామన్న కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరంలాంటిదన్నారు. ఇందులో జైనథ్ మండల కేంద్రానికి చెందిన ముగ్గురు, గూడ గ్రామానికి చెందిన ఇద్దరు, టిప్పర్వాడకు చెందిన ఒకరికి చెక్కులను అందజేశారు.