Asian Games : భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)పై చర్యలు తీసుకోవాలని ఉద్యమించిన రెజ్లర్లకు ఊరట లభించింది. ఆసియా గేమ్స్ ట్రయల్స్ నుంచి వినేశ్ ఫోగట్(Vinesh Phogat), భజ్రంగ్ పూనియా(Bajrang Punia), సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియన్, జితేందర్ కిన్హలకు ఒలింపిక్ సంఘం(Indian Olympic Association) అడ్ హక్ కమిటీ(ad hoc committee) మినహాయింపు ఇచ్చింది. ఆగస్టులో నిర్వహించనున్న ఒకే ఒక బౌట్లో పోటీ పడేందుకు వీళ్లకు అనుమతించింది. దాంతో, ఆయా విభాగాల్లోని ట్రయల్స్ విజేతలతో ఈ ఆరుగురు పోటీ పడనున్నారు. ఈ విషయాన్ని రెజ్లర్లకు ఏఓఏ తెలియజేసింది.
‘వినేశ్ ఫోగట్, భజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవర్త్ కడియన్, జితేందర్ కిన్హలకు వారి వారి విభాగాల్లో ట్రయల్స్ను ఆగస్టు 5 నుంచి 15 వరకు జరగనున్నాయి. ఆసియా గేమ్స్ ట్రయల్స్ విజేతలతో వీళ్లు పోటీ పడాల్సి ఉంటుంది. ఇంతకుముందు వరల్డ్ చాంపియన్షిప్స్, ఒలింపిక్ క్వాలిఫికేషన్ కోసం ట్రయల్స్ జరిగినా కూడా మళ్లీ నిర్వహిస్తాం’ అని రెజ్లర్లకు పంపిన లెటర్లో అడ్ హక్ కమిటీ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ బజ్వా(Bhupender Singh Bajwa) తెలిపాడు.
వినేశ్ ఫోగట్, భజ్రంగ్ పూనియా
ఈ నెల ప్రారంభంలో వినేశ్ ఫోగట్, భజ్రంగ్ పూనియా బృందం క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ను కలిశారు. ఆందోళన కారణంగా తమకు ప్రాక్టీస్ చేసేందుకు సమయం లేదని, ఆగస్టులో నిర్వహించే ఆసియా గేమ్స్ ట్రయల్స్లో ఆడేందుకు తమను అనుమతించాలని కోరారు. దాంతో, రెజ్లర్ల పేర్ల నమోదు తేదీని జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగించాలని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ను మంత్రి అభ్యర్థించారు. ఈ ఆరుగురు రెజ్లర్లలో భజ్రంగ్, వినేశ్ మాత్రమే ఆసియా గేమ్స్లో పతకాలు సాధించారు. ప్రస్తుతం వీళ్లు డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగనన్నారు. మైనర్ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు పోలీసులు అతడిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయడంతో తమ పోరాటానికి కాసేపు విరామం ఇచ్చారు. సాక్షి మాలిక్, భజ్రంగ్ తమ రైల్వే ఉద్యోగ విధుల్లో చేరారు.