న్యూఢిల్లీ: టీమ్ఇండియా హెడ్ కోచ్ ఎంపిక కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటన విడుదల చేసింది. హెడ్ కోచ్తో పాటు మరో నాలుగు పోస్టులకు ఆదివారం బీసీసీఐ ప్రకటన జారీ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ గడువు టీ20 ప్రపంచకప్తో ముగియనుండగా.. అనంతరం రెండు సంవత్సరాల కాలపరిమితి కోసం బోర్డు కొత్తవారిని ఎంపిక చేయనుంది. దరఖాస్తు గడువు ఈ నెల 26తో ముగియనుండగా.. మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖాయమైన విషయం తెలిసిందే. ‘అన్ని ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్టును అభివృద్ధి చేయడంతో పాటు భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందేలా తీర్చిదిద్దేవారు సంప్రదించండి’ అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.
అర్హతలు
వయసు 60 ఏండ్లు మించకూడదు.
30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి.
అంతర్జాతీయ క్రీడాకారుడు కాకపోతే.. ఏదైనా అంతర్జాతీయ జట్టుకు రెండేండ్లు లేక ఐపీఎల్ టీమ్కు మూడేండ్లు కోచ్గా వ్యవహరించి ఉండాలి.