దేశవాళీతో పాటు ఐపీఎల్ లో రాణిస్తూ టీమిండియాలో చోటు కోసం తపిస్తున్న క్రికెటర్లలో హర్యానాకు చెందిన రాహుల్ తెవాటియా ఒకడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆల్ రౌండర్.. ఇటీవలే భారత జట్టు ఐర్లాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకుంటానని భావించాడు. కానీ అతడి ఆశలు అడియాసలే అయ్యాయి.
కొద్దిరోజుల క్రితం బీసీసీఐ ప్రకటించిన 17 మంది సభ్యుల జాబితాలో తెవాటియా పేరు లేదు. దీంతో అతడు ట్విటర్ వేదికగా ‘అంచనాలు బాధిస్తాయి’ అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెవాటియాకు దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ కీలక సూచన చేశాడు. ట్విటర్ ను మానేసి ఆట మీద దృష్టి పెట్టాలని సూచించాడు.
తెవాటియా గురించి ఓ టీవీ ఛానెల్ లో అడిగిన ప్రశ్నకు స్మిత్ స్పందిస్తూ.. ‘మీకు ఎంత టాలెంట్ ఉన్నా టీమిండియాలో చోటు దక్కించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలు కూడా ఆస్ట్రేలియాలో పరిస్థితులకు (రాబోయే టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో) తగ్గట్టు ఆడగలిగే ఆటగాళ్లనే ఎంపిక చేసుకుంటున్నారు. నువ్వు (తెవాటియాను ఉద్దేశిస్తూ) టీమిండియాలోకి రావాలంటే ముందు ట్విటర్ లో ఉండటం మానేసి నీ ఆట మీద దృష్టి పెట్టు. ఆటతీరు మెరుగుపరుచుకో. నీ టైమ్ వచ్చినప్పుడు ఎవరూ నిన్ను ఆపలేరు..’అని అన్నాడు.
ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడిన తెవాటియా.. 12 ఇన్నింగ్స్ లలో 217 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ చివర్లో ఫినిషర్ గా గుజరాత్ కు పలు మ్యాచులలో విజయాలు అందించాడు తెవాటియా. గతేడాది స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో అతడు భారత జట్టుకు ఎంపికైనా ఆడే అవకాశం మాత్రం రాలేదు.