INDvsSA T20I: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం ముగిసిన రెండో టీ20లో టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ను ఔట్ చేయగానే సఫారీ బౌలర్ తబ్రేజ్ షంసీ వినూత్న రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. తన కుడికాలి షూ ని తీసి ఫోన్ చేస్తున్నట్టుగా ‘షూ కాల్’ సెలబ్రేషన్ చేశాడు. దీనిపై భారత అభిమానులు, నెటిజన్లు షంసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా షంసీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిపాడు. అది జస్ట్ ఫన్ కోసమే చేసిందని, ఏ ఆటగాడినీ కించపరచడానికి కాదని వెల్లడించాడు.
మ్యాచ్ అనంతరం షంసీ స్పందిస్తూ… ‘అది కేవలం ఫన్ సెలబ్రేషన్. గతంలో కూడా నేను పలుమార్లు వికెట్ తీయగానే అలాగే సెలబ్రేట్ చేసుకునేవాడిని. పిల్లలు దానిని చాలా ఇష్టపడతారు. కానీ మ్యాచ్లు చూడటానికి వచ్చే పిల్లలు చాలా మంది నన్ను పదే పదే దానిగురించి అడుగుతున్నారు. వాళ్లను డిసప్పాయింట్ చేయడం ఎందుకని అలా చేశాను. నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాను. ఆ సెలబ్రేషన్ ఏ ఆటగాడిని కించపరచడానికి కాదు… ’ అని అన్నాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి 55 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ను సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 70 పరుగులు జోడించారు. 36 బంతుల్లోనే ఐదు బౌండరీలు, మూడు భారీ సిక్సర్ల సాయంతో సూర్య 56 పరుగులు చేశాడు. సూర్యతో పాటు భారత దూకుడుకు షంసీ అడ్డుకట్టవేశాడు. ఈ మ్యాచ్లో షంసీ నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.