INDvsSA 2nd Test: మూడు దశాబ్దాల కలను నెరవేర్చుకునేందుకు గాను దక్షిణాఫ్రికాకు వెళ్లిన భారత జట్టు సెంచూరియన్ వేదికగా ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో దారుణ ఓటమి పాలవడంతో సిరీస్ నెగ్గే ఛాన్స్ను కోల్పోయింది. రెండు మ్యాచ్లే ఉన్న ఈ సిరీస్లో భాగంగా జనవరి 3 నుంచి మొదలుకాబోయే రెండో టెస్టులో గెలిచినా భారత్.. డ్రా చేసుకోవడం తప్పితే సిరీస్ నెగ్గే పరిస్థితి అయితే లేదు. అయితే కేప్ టౌన్లో గెలవడం సంగతి పక్కనబెడితే ఇక్కడ కూడా మెన్ ఇన్ బ్లూకు మరోసారి షాకిచ్చేందుకు సఫారీలు సిద్ధమవుతున్నారు. సెంచూరియన్ మాదిరిగానే కేప్ టౌన్ కూడా బౌలర్లకు భీభత్సంగా అనుకూలిస్తుందట..
కేప్ టౌన్లోని న్యూలాండ్స్ క్రికెట్ స్టేడియంలో భారత్కు చెత్త రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఇక్కడ ఆరు టెస్టులు ఆడిన టీమిండియా.. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. నాలుగింటిలో పరాభవాలు మూటగట్టుకుని రెండు మ్యాచ్లను డ్రా చేసుకుంది. గత పర్యటన (2021-22)లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్లో భారత్కు ఓటమి తప్పలేదు.
The beautiful Cape Town Stadium. (PTI)
– What a view! pic.twitter.com/KQN3uHtyQk
— CricketMAN2 (@ImTanujSingh) January 1, 2024
టెస్టు సిరీస్లో ఇప్పటికే 0-1 తో ఉన్న భారత జట్టును మరోసారి పేస్ ఉచ్చులో బిగించేందుకు సఫారీలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పిచ్మీద పచ్చిక ఉండటంతో అది కాస్తా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనుంది. సఫారీ పేసర్లు మరోసారి భారత బ్యాటింగ్ లైనప్ను తమ బౌన్సర్లతో బెంబేలెత్తించేందుకు రెడీ అవుతున్నారు. మూడు రోజుల పాటు బౌన్సర్లకు అనుకూలించే ఈ పిచ్.. చివరి రెండు రోజులు మాత్రం స్పిన్నర్లకు సహకరిస్తుందని క్యూరేటర్ తెలిపారు. కేప్ టౌన్ పిచ్ రిపోర్టుతో భారత అభిమానులకు మరోసారి ఆందోళన మొదలైంది. తొలి టెస్టులోనే సఫారీ పేస్ త్రయం రబాడ, బర్గర్, జాన్సెన్లు భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టారు. తొలి ఇన్నింగ్స్లో కాస్తో కూస్తో ప్రతిఘటించినా రెండో ఇన్నింగ్స్లో మాత్రం పూర్తిగా చేతులెత్తేయడంతో సఫారీలు భారీ విజయాన్ని అందుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లు పోటీపడి వికెట్లు సాధించిన చోట మన బౌలర్లు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. మరి కేప్ టౌన్లో అయినా భారత్.. బ్యాటింగ్, బౌలింగ్లలో రాణించి న్యూలాండ్స్లో తొలి టెస్టు విజయం సాధిస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.