IndvsPak | టీ20 ప్రపంచకప్లో అత్యంత రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచకప్ టోర్నీల్లో ఒక్కసారి కూడా పాక్ చేతిలో భారత్ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని పాక్ జట్టు కసిగా ఉంది.
పాక్ జట్టు సారధి బాబర్ ఆజమ్ అద్భుత ఫామ్లో ఉండటం ఆ జట్టులో ఆశలు రేపుతోంది. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ రెండు జట్ల బలాబలాలను విశ్లేషించాడు. యూఏఈ పరిస్థితుల విషయంలో పాక్ కన్నా భారత జట్టుకే ఎక్కువ సానుకూలత ఉందని ఆమిర్ అన్నాడు.
ఎందుకంటే భారత క్రీడాకారులు కొన్నిరోజుల క్రితం వరకూ ఇక్కడే ఐపీఎల్ ఆడారని, అందుకే ఇక్కడి పరిస్థితులకు వారు బాగా అలవాటు పడ్డారని ఆమిర్ వివరించాడు. అదే సమయంలో బ్యాటింగ్ విభాగంలో పాక్ జట్టు కొంత బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
భారత జట్టు వద్ద మంచి బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ రోహిత్, కోహ్లీ ఇద్దరూ కూడా ఐపీఎల్లో కొంత ఇబ్బంది పడటం చూశామని గుర్తుచేశాడు. టీ20 క్రికెట్లో దేన్నీ అంచనా వేయలేమని చెప్పాడు. అయితే పరిస్థితులకు అలవాటు పడిన భారత జట్టుకు ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు కొంత ఎక్కువ ఉన్నాయని అన్నాడు. ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం భారత్కు 60 శాతం, పాకిస్థాన్కు 40 శాతం ఉందని పేర్కొన్నాడు.