INDvsAUS T20I: వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ను పది రోజులు గడవకముందే టీ20 ఫార్మాట్లో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడించిన యువ భారత్.. మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. అసోంలోని బర్సపర స్టేడియంలో మంగళవారం (నవంబర్ 28) మూడో మ్యాచ్ జరగాల్సి ఉంది. వైజాగ్లో బౌలర్లు తడబడ్డా తిరువనంతపురంలో మాత్రం కంగారూలను కట్టడిచేశారు. మరి గువహతి (బర్సపర) వేదికగా జరుగబోయే మ్యాచ్లో భారత్ ఏం చేయనుంది. ఇక్కడ భారత రికార్డు ఎలా ఉంది..?
బర్సపరలో భారత్ 2017 నుంచి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్నది. ఇక్కడ భారత్ ఇప్పటివరకూ మూడు మ్యాచ్లు ఆడింది. మూడింటిలో తొలి మ్యాచ్ ఆడింది ఇదే ఆసీస్తో కావడం గమనార్హం. 2017లో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా.. 118 పరుగులకే కుప్పకూలింది. బెరెన్డార్ఫ్ రాణించడంతో ఆ మ్యాచ్లో ఆసీస్ ఘనవిజయం సాధించింది. 2020లో శ్రీలంకతో మ్యాచ్ వర్షం కారణంగా అర్థాంతరంగా రద్దయింది. గతేడాది సౌతాఫ్రికాతో ఇక్కడ జరిగిన మ్యాచ్లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 237 పరుగుల భారీ స్కోరు చేసింది. బదులుగా సఫారీలు కూడా ధాటిగా ఆడారు. డేవిడ్ మిల్లర్ 47 బంతుల్లో సెంచరీ చేసినా ప్రొటీస్ జట్టు 20 ఓవర్లలో 221 పరుగులే చేయగలగడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది.
సిరీస్లో 2-0తో ముందంజ వేసిన భారత్.. అదే ఊపు కొనసాగిస్తే ఆసీస్ను కట్టడిచేయడం అంత కష్టమేమీ కాదు. బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్లతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నయా ఫినిషర్ రింకూ సింగ్ కూడా టచ్లో ఉండటంతో భారత్కు కలిసొచ్చేదే. బౌలింగ్లో తొలి మ్యాచ్లో విఫలమైనా రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణలు రెండో మ్యాచ్లో పుంజుకున్నారు. ముఖేష్ కుమార్ డెత్ ఓవర్లలో ఆకట్టుకుంటున్నాడు. అర్ష్దీప్ సింగ్ మాత్రం ఇంకా లయను అందుకోలేకపోవడం భారత్ను వేధిస్తున్నది.