INDvsAUS T20I: భారత్ – ఆసీస్ మధ్య బర్సపర (గువహతి) వేదికగా ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్లో విజయం కంగారూలనే వరించింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (48 బంతుల్లో 104 నాటౌట్, 8 ఫోర్లు, 8 సిక్సర్లు) మోత మెగించడంతో భారత్ నిర్దేశించిన 223 పరుగుల ఛేదనలో ఆసీస్ ఆఖరి బంతి దాకా పోరాడి ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాక్స్వెల్కు తోడు ట్రావిస్ హెడ్ (18 బంతుల్లో35, 8 ఫోర్లు) ఆఖర్లో కెప్టెన్ మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ , అక్షర్ పటేల్ భారీగా పరుగులు సమర్పించుకుని భారత విజయావకాశాలను దెబ్బతీశారు. ఈ విజయంతో ఆసీస్ సిరీస్లో భారత ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.
భారీ ఛేదనను ఆసీస్ ఘనంగానే ఆరంభించింది. నాలుగు ఓవర్లలోనే ఆ జట్టు 47 పరుగులు రాబట్టింది. భారత్కు వన్డే వరల్డ్ కప్ను దూరం చేయడంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు.ఆరోన్ హార్ఢీ (12 బంతుల్లో 16, 3 ఫోర్లు) కూడా మూడు బౌండరీలు బాదినా ఎక్కువసేపు క్రీజులో ఎక్కువసేపు నిలవలేదు. అర్ష్దీప్ సింగ్ ఈ జోడీని విడదీశాడు. అతడు వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి హార్ఢీ.. ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే అవేశ్ ఖాన్.. ట్రావిస్ హెడ్ను ఔట్ చేశాడు. ఇదే ఊపులో రవి బిష్ణోయ్ కూడా ఏడో ఓవర్లో జోష్ ఇంగ్లిస్ను బౌల్డ్ చేశాడు.
మ్యాక్సీ మోత..
68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ను మ్యాక్స్వెల్ – స్టోయినిస్ (21 బంతుల్లో 17, 2 ఫోర్లు) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ 41 బంతుల్లో 60 పరుగులు జతచేశారు. ప్రసిధ్ కృష్ణ వేసిన 8వ ఓవర్లో మ్యాక్స్వెల్.. 4, 6, 4, 6 బాదాడు. ఆ ఓవర్లో 23 పరుగులొచ్చాయి. మ్యాక్సీ బాదుడుతో ఆసీస్ పది ఓవర్లలో వంద పరుగులు చేసింది. అయితే ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. అక్షర్ వేసిన 13వ ఓవర్లో స్టోయినిస్.. సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్టోయినిస్ నిష్క్రమించిన మరుసటి ఓవర్లోనే రవి బిష్ణోయ్ ఆసీస్కు మరో భారీ షాక్ ఇచ్చాడు. 14వ ఓవర్లో అతడు వేసిన మూడో బంతికి టిమ్ డేవిడ్ కూడా ఔటయ్యాడు. అర్ష్దీప్ వేసిన 15వ ఓవర్లో నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదిన మ్యాక్స్వెల్ 27 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్.. ఐదు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
ఆఖర్లో…
ఆఖరి ఐదు ఓవర్లలో ఆసీస్ విజయలక్ష్యం 78 పరుగులుగా ఉండగా అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో అవేశ్ ఖాన్ 13 పరుగులిచ్చాడు. అర్ష్దీప్ వేసిన 17వ ఓవర్లో మ్యాక్సీ రెండు భారీ సిక్సర్లు బాదడంతో 16 పరుగులొచ్చాయి. 18వ ఓవర్ వేసిన ప్రసిధ్ కృష్ణ ఆరు పరుగులే ఇచ్చాడు. దీంతో సమీకరణం రెండు ఓవర్లలో 43 పరుగులకు మారింది. కానీ అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్లో 22 పరుగులు రావడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. ఆఖరి ఆరు బంతుల్లో 21 పరుగులు చేయాల్సి ఉండగా సూర్య ఆఖరి ఓవర్ను ప్రసిధ్కు ఇచ్చాడు. వేడ్ తొలి బంతికే బౌండరీ బాదాడు. ఆ తర్వాత అతడు సింగిల్ తీసి ఇవ్వగా మ్యాక్స్వెల్.. భారత ఆశలపై నీళ్లు చల్లాడు. 6, 4, 4 బాదడంతో అతడి సెంచరీ పూర్తయింది. 47 బంతుల్లోనే అతడి శతకం పూర్తవగా చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా.. బౌండరీ కొట్టి ఆసీస్ కు విజయాన్ని అందించాడు. ఆఖరి ఓవర్లో ప్రసిధ్ 23 పరుగులిచ్చాడు.